Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరిచేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలవారీగా బుధవారం నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు జాతాలు నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ చెప్పారు. రైతాంగ, కార్మిక పోరాటాలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు బలపర్చాలనీ, పార్టీలకు, అనుబంధాలకు అతీతంగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతాకు సంబంధించిన పాటల సీడీని మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు, యాజమానులకు తొత్తుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రాష్ట్రంలోని రైతులు కూలీలుగా మారే ప్రమాదముందనీ, 25 లక్షల మంది కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు రోడ్డున పడుతారని ఆందోళన వెలిబుచ్చారు. విద్యుత్ సవరణ బిల్లు ఆమోదం పొందితే రైతులకు, ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతులకు ఇస్తున్న ఉచిత కరెంట్, క్రాస్సబ్సిడీలు ఎత్తివేయబడతాయని వివరించారు. ఆదానీ, తదితర కార్పొరేట్లకు చెందిన విద్యుత్ సంస్థలకు లాభాలు చేకూరేలా విద్యుత్ చట్టాన్ని సవరిస్తూ బిల్లు తెచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొవచ్చిన 3 వ్యవసాయ చట్టాలు, 4 లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ 2020 బిల్లును బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటిని తిరస్కరిస్తున్నట్టు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని ప్రకటించాలనీ, అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. మోడీ కార్మిక, కర్షక విధానాలను తిప్పికొట్టేందుకే ఈ జాతాలు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 10 బృందాలకు సీఐటీయూ రాష్ట్ర బాధ్యులు నాయకత్వం వహిస్తారనీ, గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.రమ, భూపాల్, జె.వెంకటేశ్, బి.మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.కోటంరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శ్రీకాంత్, యాటల సోమన్న, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రారంభం ప్రారంభకులు
ఉమ్మడి నల్లగొండ దేవరకొండ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి
ఉమ్మడి మెదక్ సిద్దిపేట రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
ఉమ్మడి ఖమ్మం ఖమ్మం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
రంగారెడ్డి -వికారాబాద్ అబ్దుల్లాపూర్మెట్ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
హైదరాబాద్ -మేడ్చల్ చిక్కడపల్లి(హైదరాబాద్) మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్
ఉమ్మడి నిజామాబాద్ బోర్గం పి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు
ఉమ్మడి ఆదిలాబాద్ జోడేఘాట్ కొమురంభీం వారసులతో కలసి ఆదివాసీ గిరిజన సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు
మహబూబ్నగర్ మహబూబ్నగర్ నవతెలంగాణ ఎడిటర్ ఆర్. సుధాభాస్కర్
ఉమ్మడి వరంగల్ మహబూబాబాద్ ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
ఉమ్మడి కరీంనగర్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి