Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారుకు హైకోర్టు ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల్లో వార్డు రిజర్వేషన్ల ప్రక్రియ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 215ను సవాల్ చేసిన రిట్ పిటిషన్లో ఏడాది కాలంగా ఎందుకు కౌంటర్ పిటిషన్ వేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికలు జరిగిపోయాయి కదా అని కౌంటర్ వేయకపోవడాన్ని తప్పుపట్టింది. మరో ఏడాది కాలం వరకూ కూడా కౌంటర్ పిటిషన్ వేసే తీరుబడి ప్రభుత్వానికి లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కడసారి వాయిదాకు అనుమతి ఇస్తున్నామనీ, జూన్ 7న తదుపరి విచారణ చేస్తామంటూ అప్పటిలోగా ప్రభుత్వ వాదనతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. వార్డుల రిజర్వేషన్లు, మహిళలకు కేటాయించిన వార్డుల రిజర్వేషన్లు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేలా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలం నాదర్గుల్కు వాసి బి.కొమరేష్ పిల్ దాఖలు చేశారు. సంవత్సరకాలంలో ప్రభుత్వం కౌంటర్ వేయలేదని పిటిషనర్ లాయర్ చెప్పారు. ఎన్నికలు ముగిసినందున పిల్పై విచారణ ముగిసిందనే భావనతో కౌంటర్ వేయలేదని ప్రభుత్వం చెప్పింది. ఎన్నికలు జరిగినప్పటికీ వార్డుల విభజన చట్ట ప్రకారం లేకపోతే ఆ ఎన్నికలకు కూడా తమ ఉత్తర్వులు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఏడాదిగా వేయని కౌంటర్ను మరో ఏడాది వరకూ ఇలాగే జాప్యం చేస్తుందా అంటూ నిలదీసింది. చివరిసారి అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు తదుపరి విచారణను జూన్ 7కి వాయిదా వేసింది.