Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో ఉద్యోగ భద్రతకే ఎసరు: నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతూ విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన ఉదయ్, ఆదిత్య పథకాల వల్ల ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు, ఆర్టిజెన్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ అన్నారు. డిస్కమ్లు పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయాయన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యుత్ ఉద్యోగుల సభ మంగళవారం జరిగింది. యుఈఈయూ డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయ్ లో చేరితే డిస్కమ్ల రూ.33 వేల కోట్ల బకాయిలు రద్దయిపోతాయని చెప్పారన్నారు. కానీ, ఎప్పటిలాగే మళ్లీ బకాయిలు, నష్టాలు పేరుకుపోయాయని చెప్పారు. డిస్కమ్లకు ఆయా ప్రభుత్వ శాఖలు రూ.12,750 వేల కోట్ల బకాయిలు పడ్డాయనీ, వాటిని చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. డిస్కమ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్టిజన్ల నుంచి ప్రతి విషయంలో రాష్ట్ర సర్కారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2020 వల్ల విద్యుత్ రంగమే ప్రమాదంలో పడబోతున్నదనీ, ఉద్యోగుల భద్రతకే గ్యారంటీ లేని పరిస్థితి రాబోతున్నదని ఆందోళన వెలిబుచ్చారు. ఎలక్ట్రిసిటీలో కాంట్రాక్టు కార్మికులే ఉండరని మింట్కాంపౌండ్ సభలో సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. ఆ హామీని ఆయన నేటి వరకు కూడా నెరవేర్చలేదన్నారు. మూడేండ్ల నుంచి ఏఆర్ఆర్లను సబ్మిట్ చేయకపోయినా ఈఆర్సీ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు, 3 వ్యవసాయ చట్టాలకు, 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో పాల్గొనాలని కోరారు. విద్యుత్ రంగంలోని ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర సీఐటీయూకి ఉందనీ, అదే ఒరవడిలో ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఈ సభనుద్దేశించి గౌరవాధ్యక్షులు భూపాల్, అధ్యక్షులు వి. కుమారచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. స్వామి, ఉపాధ్యక్షులు కె. ఈశ్వరరావు తదితరులు ప్రసంగించారు.
యుఈఈయూ డైరీని ఆవిష్కరించిన ట్రాన్స్కో, జెన్కో సీఎండీలు
తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్యూనియన్ (సీఐటీయూ అనుబంధం) -2021 డైరీని హైదరాబాద్లోని విద్యుత్ సౌధలో ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు, జెన్కో సీఎండీ రఘుమారెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్గా వర్తింపజేయాలనీ, ఆర్టిజెన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ నిబంధనలు అమలు చేయాలని, పీస్ రేటు కార్మికులకు కార్మిక చట్టాలు, కనీస వేతనాల జీఓ 11 అమలు చేయాలని కోరారు. అన్మెన్ కార్మికులను ఆర్టిజెన్లుగా గుర్తించాలని విన్నవించారు. డిమాండ్లను పరిశీలిస్తామని సీఎండీ ప్రభాకర్రావు హామీనిచ్చారు. ఉన్నతాధికారులను యూనియన్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో యుఈఈయూ గౌరవాధ్యక్షులు భూపాల్, అధ్యక్షలు వి. కుమారాచారి, ప్రధాన కార్యదర్శి వి. గోవర్ధన్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్. స్వామి, ఉపాధ్యక్షులు కె. ఈశ్వరరావు, ప్రసాదరాజు, మురళి, మధు, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.