Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే నెల 2న మున్సిపల్, మండల కేంద్రాల్లో నిరసనలు
- ఫిబ్రవరి 12న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాట స్ఫూర్తితో గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు ఉద్యమించాలనీ, వచ్చే నెల రెండో తేదీన మున్సిపాల్టీ, మండల కేంద్రాల్లో జరిగే నిరసనలను, 12వ తేదీన జరిగే కలెక్టరేట్ల ఎదుట ధర్నాలను జయప్రదం చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖమర్అలీ, పాలడుగు భాస్కర్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు జి.పాండు పిలుపునిచ్చారు. ఆ యూనియన్ల క్యాలెండర్లను సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, పి.జయలక్ష్మి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ..అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇందిరా పార్కు వద్ద 24 గంటల ధర్నా చేయన్నుట్టు తెలిపారు. సీఐటీయూ తలపెట్టిన ''కార్మిక-కర్షక పోరుయాత్ర''ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జీఓ నెం.14లో పేర్కొన్న కేటగిరీల వారీగా వేతనాలు అమలు కావట్లేదన్నారు. కొత్త మున్సిపాల్టీల్లో తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. వేతనాలు పెంచుతామని సీఎం చేసిన ప్రకటన జాబితాలో మున్సిపల్, గ్రామ పంచాయితీ కార్మికులు, ఉద్యోగులను చేర్చకపోవడం సరిగాదన్నారు. పీఆర్సీ జాప్యం వల్ల జీపీ, మున్సిపాల్టీల్లో కార్మికులకు వేతనాలు పెరగటం లేదన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్లో పనులను రాంకీ లాంటి ప్రయివేటు సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతున్నదనీ, దీన్ని కార్మికులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.c