Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పొతినేని
- నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని భారీ ప్రదర్శన
- తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-పాల్వంచ/కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ ప్రకారం నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనీ, లేని పక్షంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి గుడిసెలు వేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ హెచ్చరించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచలో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనీ, నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే పూర్తి చేయాలనీ, 200 గజాలు వరకు పేదలకు ఎల్ఆర్ఎస్ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 5 వేల మందితో పార్టీ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శనగా నటరాజ్సెంటర్, శాస్త్రీరోడ్, మార్కెట్ రోడ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ముట్టడించారు. అనంతరం తహసీల్దార్కు పేదలు పెట్టుకున్న దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పోతినేని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేదల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల కంటే మిన్నగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి నిధులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తూ నిరుపేదలను మోసం చేస్తున్నారని అన్నారు. 'డబుల్' ఇండ్లకు పట్టణ పేదలు ఎంతోమంది దరఖాస్తు పెట్టుకున్నా, ఆందోళన చేసినా పట్టించుకోకుండా హామీలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో ఎన్నో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి అధికారులు సహకరిస్తూ నిరుపేదలు జానెడు జాగలో గుడిసె వేసుకుంటే నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలనీ, లేకపోతే ప్రభుత్వ భూములను ఆక్రమించి గుడిసెలు వేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 25న ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న జిల్లా కలెక్టరేట్ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇండ్ల స్థలాలు ఇవ్వడంలో విస్మరించారనీ, పైగా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై భారాలు మోపి ఖజానా నింపుకోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి దొడ్డా రవికుమార్, పట్టణ కమిటీ సభ్యులు మెరుగు ముత్తయ్య, సత్య, వాణి, ఎస్కె రహీం, రాధమ్మ, క్రాంతి, వరలకిë, సులోచన, వసంత పాల్గొన్నారు.
25న పోడుపోరు మహా ప్రదర్శన
ఆదివాసీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు పోడు పట్టాలు ఇస్తామని సీఎం వాగ్దానమిచ్చి ఏడేండ్లు గడిచినా ఒక్క పోడు సాగుదారులకు పట్టా ఇవ్వలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచికంటి భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గిరిజనులకు అనుకూలంగా మాటలు చెబుతున్నాడే తప్ప వారికి న్యాయం చేసేవిధంగా చర్యలు కనిపించడంలేదన్నారు.
సీఎం కేసీఆర్, విప్ కాంతారావు ఇద్దరూ గిరిజనులను మాయమాటలతో మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారుల మీదికి ఉసిగొలిపే విధంగా ప్రకటనలు చేయడం సరికాదనీ, ఆయన్ని బర్తరఫ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొద్దు నిద్రలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని లేపేందుకు ఈనెల 25న భారీ 'పోడు పోరు' మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు, సభకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృంద కారత్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నట్టు తెలిపారు. పోడు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్ పాల్గొన్నారు.