Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నరసింహరెడ్డి
నవతెలంగాణ-రాంనగర్/ నారాయణపేట టౌన్
కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకే కేంద్ర సర్కారు ప్రజా ఉద్యమాలను అణచివేసి చట్టాల సవరణలు చేస్తోందని, ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదమని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి అన్నారు. కార్మిక, కర్షక ఐక్యతా దినం సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ చట్టాలు, కార్మిక చట్టాల సవరణను నిరసిస్తూ పలు జిల్లాల్లో ప్రధాని మోడీ, ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఆర్.వెంకట్రాములు అధ్యక్షతన జరిగిన సదస్సులో నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల సామాజిక, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందన్నారు. ఇప్పుడు వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించడానికి కొత్త వ్యవసాయ చట్టాలను, విద్యుత్తు చట్ట సవరణలను, సంస్కరణలను తెచ్చిందన్నారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చిందన్నారు. ఈ చర్యలతో రాష్ట్రాలకు ఉన్న రాజ్యాంగబద్ద హక్కులను హరిస్తోందని చెప్పారు. కేంద్రం తెచ్చిన చట్టాలు అమలైతే రైతుల పంటలకు మద్దతు ధరలు కల్పించే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటాయన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటం రాజు మాట్లాడుతూ.. కార్మికవర్గంపై దాడిని ఎదుర్కోవాలంటే కార్మిక, కర్షక ఐక్యతే ఏకైక మార్గం అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం తేవాలన్నారు. ఈ సదస్సులో వ్యకాస రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్, మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నష్టదాయక బిల్లులను రద్దు చేయాలి:రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
కార్మికులు, రైతులను దివాలా తీయించే వ్యవసాయ, కార్మిక, విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుసంఘం, వ్యకాస, సీఐటీయూ ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించకపోతే రైతును కార్పొరేట్ శక్తులు నిట్టనిలువున దోపిడీ చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా దేశంలో ఆకలి చావులు సంభవిస్తాయన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం ముందే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఇప్పుడు యజమానులకు అనుకూలంగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. కేంద్రం తీరును ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్రామిరెడ్డి, బాలరాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలప్ప, గోపాల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజిలయ్య గౌడ్, సీఐటీయూ నాయకులు లక్ష్మణ్, కాశప్ప పాల్గొన్నారు.