Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీ చెల్లింపులో సర్కారు జాప్యం
- ఏడాది కిందటే చెల్లిస్తానని ప్రకటించిన ప్రభుత్వం
- రుణాల చెల్లింపుల్లో ఆలస్యమైతే వర్తించని వడ్డీ రాయితీ!
- కరోనా ఇబ్బందుల్లోనూ అప్పుల్జేసి కట్టిన మహిళలు
మిత్తి పైసల కోసం స్వయం సహాయక సంఘాల మహిళలు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాల వాయిదాలు సక్రమంగా చెల్లిస్తేనే స్వయం సహాయక మహిళా సంఘాలకు సర్కారు వడ్డీ రాయితీ ఇస్తుంది. కరోనా కష్టకాలంలోనూ మహిళలు అప్పుల్జేసి అయినా బకాయిలు చెల్లిస్తూ వస్తున్నారు. కానీ, 2019 నవంబర్లో బ్యాంకు లింకేజీ రుణాల పెండింగ్ వడ్డీ రూ.618కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా వారికి అందలేదు. ఏడాది కాలంగా మిత్తి పైసల కోసం ఎదురు చూస్తున్నారు.
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయా ఆర్థిక సంవత్సరాల్లో అర్హులైన మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తోంది. రుణాలు సద్వినియోగం చేసుకుంటూ మహిళలు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం వడ్డీలేని రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన సంఘాలకు 2019 నవంబర్లో బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీని విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ విడుదల చేయకపోవడం పట్ల మహిళలు ఆవేదన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 527 గ్రామసంఘాలు, 12వేల 482 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో లక్షా 36వేల 829 మంది సభ్యులు ఉన్నారు. 2020-201 ఆర్థిక సంవత్సరంలో 10వేల 617 సంఘాలకుగాను రూ.446.37కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, 6వేల 704 సంఘాలకు రూ.307.42కోట్లు రుణాలు ఇచ్చి 68.87శాతం పూర్తి చేసింది. జగిత్యాల జిల్లాలో 11వేల 149 సంఘాలకుగాను రూ.389.42కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా, 7వేల 924సంఘాలకు రూ.264.18కోట్లు ఇచ్చింది. 67.84శాతం మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంది. పెద్దపల్లి జిల్లాలో 8వేల 750 సంఘా లకుగాను రూ.281.6కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలన్న లక్ష్యానికిగాను 6వేల 410 సంఘాలకు రూ. 192.25కోట్లు ఇచ్చి 68.27శాతం చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7వేల 596 స్వయం సహాయక మహిళా సంఘాలకు గాను రూ.277.78కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా రూ.5వేల 599 సంఘాలకు రూ.178.08 కోట్లు ఇచ్చింది. ఈ జిల్లాలో 64.11శాతం లక్ష్యాన్ని చేరుకుంది. అయితే, ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని ఆయా స్వయం సహాయక మహిళా సంఘాలకు ఒక్కో జిల్లాకు సుమారు రూ.20కోట్ల చొప్పున రూ.80కోట్ల మేర వడ్డీ బకాయిలు చెల్లించాల్సి ఉంది.
కరోనా ఇబ్బందుల్లోనూ అప్పుల్జేసి మరీ వాయిదాల చెల్లింపులు
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన వడ్డీని విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం 2019 నవంబర్లో ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.618కోట్లు పెండింగ్లో ఉన్న రుణాలకు వడ్డీని విడుదల చేసినట్టు కూడా చెప్పింది. అయితే అది కేవలం ప్రకటనకే పరిమితం కావడంతో మహిళా సంఘాల సభ్యులు ఆవేదన చెందుతున్నారు. బ్యాంకుల నుంచి సభ్యులు తీసుకున్న రుణానికి క్రమం తప్పకుండా వడ్డీ కలిపి వాయిదాలు చెల్లిస్తున్నారు. వాయిదాల చెల్లింపులో క్రమం తప్పితే వడ్డీ మినహాయింపు అవకాశాన్ని కోల్పోతున్నారు. దీంతో బ్యాంకు లింకేజీ కింద పొందిన రుణాలకు సభ్యులు కరోనా కాలంలోనూ అప్పులు చేసి వాయిదాలు చెల్లించారు. ప్రభుత్వం విడుదల చేయనున్న వడ్డీ కోసం నిరీక్షిస్తున్నారు.
నిధులు రాగానే అందజేస్తాం:వెంకటేశ్వర్లు- డీఆర్డీఓ- కరీంనగర్ జిల్లా
2020-21లో కరీంనగర్ జిల్లాలోని 6వేల 704 సంఘాలకు రూ.307.42కోట్లు రుణాలు బ్యాంకు లింకేజీ ద్వారా అందించాం. వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీ నిధులు అందజేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులు రాగానే ఆయా సంఘాల సభ్యుల ఖాతాలో జమ చేస్తాం.