Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రోజురోజుకూ కేంద్రం ఈ ధరలను అడ్డూఅదుపు లేకుండా పెంచుతూ ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నదని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. లీటర్ పెట్రోల్ అసలు ధర రూ.28.50 కాగా వివిధ పన్నుల పేరుతో రూ.88.63కు, లీటర్ డీజిల్ అసలు ధర రూ.29.53 కాగా రూ.81.99కు హైదరాబాదులో అమ్ముతున్నారని వివరించారు. 2014లో నరేంద్రమోడీ అధికారానికొచ్చేనాటికి లీటర్ పెట్రోల్పై రూ.9.48 ఉన్న కేంద్ర పన్ను నేడు రూ.32.98కి, డీజిల్పై రూ.3.56 ఉన్న కేంద్ర పన్ను రూ.31.83కు పెంచి సామాన్య ప్రజలపై భారాలు వేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలను వెంటనే తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయిల్ ధరల పెరుగుదల వల్ల రవాణా రంగంతో పాటు, నిర్మాణ రంగానికీ కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. లాక్డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నిర్మాణ రంగంలో ముడిసరుకుల రేట్లు విపరీతంగా పెరగడంతో పనులు ఆగిపోయి కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారని వివరించారు. లాక్డౌన్ కాలంలో ప్రపంచంలో ఆయిల్ ధరలు జీరో స్థాయికి పడిపోయినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా ఆయిల్ కంపెనీలు, కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఖజానాలో వేసుకున్నాయని విమర్శించారు. ప్రధాని మోడీ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల దేశ ప్రజానీకానికి కష్టాలు, కడగండ్లు తెచ్చిపెట్టారని పేర్కొన్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల కోసం కన్నీరు కారుస్తున్నట్టు మోడీ నటిస్తున్నారు తప్ప వారి కన్నీరు తుడిచేందుకు కాదని తెలిపారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను విడనాడి ఆయిల్ మూల ధరపై వేస్తున్న పన్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై పడుతున్న ఈ భారాలను తగ్గించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు, ఆ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు.