Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ యజ్ఞంలా కాళేశ్వరం
- ప్రాజెక్టులన్నింటినీ త్వరగా పూర్తి చేస్తాం : సీఎం కేసీఆర్
నవతెలంగాణ-భూపాలపల్లి/మహాదేవ్పూర్
రైతుల సాగునీటి గోసను శాశ్వతంగా రూపుమాపడమే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఓ యజ్ఞంలా చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులనూ త్వరగా పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్ మండల పరిధిలోని మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మంగళవారం సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని పరిశీలించారు. సీఎం సతీమణి శోభ, మంత్రులు, అధికారులతో కలిసి గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు.
ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో ఆశించిన రీతిలో పూర్తయి నిరాటంకంగా నీటి పంపింగ్ జరుగుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేశారంటూ నీటి పారుదల, ఇతర శాఖల అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలను అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా
ఆపరేషన్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని దిశానిర్ధేశం చేశారు. కాళేశ్వరం స్పూర్తితో రాష్టంలో ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాణహిత, గోదావరి నదుల నీళ్లు కలిసిన తర్వాత బ్యారేజీ నిర్మిస్తే ఎక్కువ కాలం అవసరమైనంత నీటిని పంపింగ్ చేయొచ్చనే వ్యూహాన్ని రూపొందించామని చెప్పారు. వ్యాప్కోస్తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి మేడిగడ్డ పాయింట్ వద్ద బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. సుమారు 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో దాదాపు 100 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించడం వల్ల దాదాపు 7 నెలల పాటు నీటిని పంపింగ్ చేయవచ్చని అంచనా వేశామన్నారు. ప్రస్తుతం 99.7 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉందని తెలిపారు. మేడిగడ్డ పాయింట్ నుంచి 54 కిలోమీటర్ల వరకు ప్రాణహితలో, 42 కిలోమీటర్ల వరకు గోదావరిలో నీరు నిల్వ ఉండటంతో జలకళ ఉట్టి పడుతోందని ఆనందం వెలిబుచ్చారు. ఎలాంటి పరిస్థితులెదురైనా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్ఎండీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ఏటా నీరందుతుందని స్పష్టం చేశారు. నిజాంసాగర్కు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అవసరమైతే ఎస్సారెస్పీకి కూడా ఈ ప్రాజెక్టు నుంచే నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర సాగునీటి ముఖచిత్రాన్ని మార్చేసిందని హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్పూర్తితో తూపాకులగూడెం, దుమ్ముగూడెం బ్యారేజీల నిర్మాణాలు శరవేగంగా జరగుతున్నాయని తెలిపారు. తొలుత కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సీఎం ఏరియల్ సర్వే చేసి అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, డీజీపీ మహేందర్రెడ్డి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీలు మురళీధర్రావు, వెంకటేశ్వర్లు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, పెద్దపల్లి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్లు పుట్ట మధు, గండ్ర జ్యోతి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట్రమణారెడ్డి, పోర్తిక చందర్, దివాకర్రావు, మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీలు పురాణం సతీష్, నారదాసు లక్మ్తణ్రావు పాల్గొన్నారు.