Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంథన్ చర్చాగోష్టిలో డాక్టర్ మాంటెక్సింగ్ అహ్లూవాలియా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి పాలకులు ఒక సమున్నత ఆశయాలు, అభివృద్ధి లక్ష్యాలతో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారని ఆ సంఘం మాజీ డిప్యూటీ చైర్మెన్, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మాంటెక్సింగ్ అహ్లూవాలియా చెప్పారు. అయితే దాన్ని రద్దు చేయటం ద్వారా దేశానికి తీరని నష్టం వాటిల్లుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంథన్ సంస్థ ఆధ్వర్యాన బుధవారం 'భారతదేశ కథ, దాని లక్ష్యాలు, ప్రస్తుత పరిస్థితులు...' అనే అంశంపై ఆన్లైన్లో చర్చాగోష్టిని నిర్వహించారు. కార్యక్రమంలో అహ్లూవాలియా ముఖ్య వక్తగా ప్రసంగించగా... ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, వాటిలోని భిన్న భౌగోళిక, వాతావరణ, సామాజిక పరిస్థితుల ఆధారంగా ప్రణాళికా సంఘం వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు, పథకాలను రూపొందించేదని అహ్లూవాలయా ఈ సందర్భంగా చెప్పారు. ఆయా పథకాలు, కార్యక్రమాలకు ఎంతమేర నిధులు కేటాయించాలనే అంశంపై కూడా ప్లానింగ్ కమిషన్ లోతైన అధ్యయనం, మేధోమథనం చేసేదని తెలిపారు. తద్వారా వెనుకబడిన రాష్ట్రాలు, వాటిలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు సమపాళ్లలో నిధులను కేటాయించాలంటూ కేంద్రానికి సిఫారసు చేసేదని గుర్తు చేశారు. తద్వారా రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలను తగ్గించేందుకు కృషి చేసిందని చెప్పారు. ఇంతటి కీలకమైన ప్రణాళికా సంఘాన్ని ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేయటం శోచనీయమని అన్నారు. దాని స్థానంలో ఇప్పుడు నిటి అయోగ్ ఉన్నప్పటికీ ఆ స్థాయిలో కేంద్రానికి, ఆర్థిక మంత్రిత్వశాఖకు దిశా నిర్దేశం చేయటం లేదని చెప్పారు. ఫలితంగా కార్యక్రమాలు, పథకాలు, వాటికి నిధులు... ఇలా ప్రతీ అంశం ఆర్థికశాఖలోనే కేంద్రీకృతమై పోతున్నదని తెలిపారు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కిం చేందుకు ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ శాయశక్తులా కృషి చేశారని అన్నారు. ప్రభుత్వం వద్ద చాలినన్ని నిధులు లేనప్పుడు... ప్రయివేటు రంగంతో ఒప్పందం చేసుకోవటం మంచిదేనేనని అభిప్రాయపడ్డారు. పీపీపీ (ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం) పద్ధతిలో చేపట్టిన అనేక కార్యక్రమాలు సఫలీకృతమయ్యాయని ఆయన వివరించారు.