Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. కరోనా నేపథ్యంలోనూ పరీక్షలను నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్తోపాటు నీట్ వంటి ప్రవేశ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల షెడ్యూల్ను రూపకల్పన చేసే పనిలో పడ్డారు. మే మొదటి వారం నుంచి ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మే 3వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశమున్నది. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశమున్నది. విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలుకు తేదీలనూ ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం కానుంది. అయితే జూనియర్ కాలేజీల పనిదినాలు 68 రోజులుండే అవకాశమున్నది. ఈ దిశగా అధికారులు అకడమిక్ క్యాలెండర్ను రూపొందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 68 పనిదినాల్లో ఎక్కువగా సిలబస్ను పూర్తిచేయడం, పునశ్చరణ తరగతులు నిర్వహించడంపైనే అధ్యాపకులు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఏప్రిల్లో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. షిఫ్ట్ పద్ధతిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే తల్లిదండ్రుల అనుమతి పత్రం తప్పనిసరి కావడంతో రోజూ పిల్లలను పంపిస్తారా? అన్న అనుమానం అధికారుల్లో కలిగింది. అందుకే జూనియర్ కాలేజీల్లో తరగతులను రోజువిడిచి రోజు నిర్వహించాలని భావిస్తున్నారు. ఒకరోజు ప్రథమ, మరుసటిరోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇంటర్ ఫెయిలైన ఫస్టియర్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి ఫెయిలైన సబ్జెక్టులతోపాటు ద్వితీయ సంవత్సరం పరీక్షలను ఎలా రాయాలని ఆందోళన చెందుతున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది ఫెయిలైన ద్వితీయ సంవత్సరం విద్యార్థులను కనీస మార్కులతో రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసిన విషయం తెలిసిందే. ఫెయిలైన ఫస్టియర్ విద్యార్థులకూ ఇదే పద్ధతిని అనుసరించే అవకాశమున్నది. ఈ ప్రతిపాదనలను ఇంటర్ బోర్డు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించినట్టు తెలిసింది.