Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్వో పోస్టులను రద్దు చేసి ఐదు నెలలవుతున్నా ఇంకా వారితోనే భూ సంబంధ పనులను చేయించడాన్ని కలెక్టర్లు మానుకోవాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోల్కొండ సతీశ్, పల్లెపాటి నరేశ్ కోరారు. ఈ మేరకు బుధవారం నాడు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. భూ సంబంధ పనులు చేయొద్దని సీఎస్ చెప్పినప్పటికీ కలెక్టర్లు ఎలా చేయిస్తారని ప్రశ్నించారు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా, తమ బాధలు వినకుండా, సమస్యలను పరిష్కరించకుండా సాదాబైనామాల పేరుతో గ్రామాలకు వెళ్లి పనిచేయాలని ఒత్తిడి చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించాలని కోరారు. తమకంటూ ఓ హోదానిచ్చి జాబ్చార్టు నిర్ధారించి ఇవ్వాలని విన్నవించారు. తమ కుటుంబాలు మానసిక ఆందోళనకు గురవుతున్నాయనీ, వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సర్కారు నిర్ణయాల వల్ల రెవెన్యూ పాలన కుంటుపడే అవకాశం ఉందనీ, తహశీల్దార్లకు ఒత్తిడి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి వీఆర్వోలను బాధ్యులను చేయొద్దని కోరారు. ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా సీఎస్ ఇవ్వకపోవడం తమను అవమానించడమేనని వాపోయారు.