Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోడ్ బహల్లో ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతం
- వచ్చే ఏడాదికి 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం :సింగరేణి సీఎండీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఒడిశాలోని అంగూల్ జిల్లా కరోడ్ బహల్ గ్రామంలో సింగరేణి సంస్థ ప్రారంభించనున్న భారీ ఓపెన్కాస్ట్ బొగ్గు గని 'న్కెనీ' బ్లాకుపై ప్రభుత్వ అధికారుల సమక్షంలో బుధవారం జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు పూర్తి సానుకూలతతో అంగీకారం తెలిపారని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఒడిశా ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నాటికి 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సంతోష్ కుమార్ప్రధాన్ అధ్యక్షత వహించగా సబ్ కలెక్టర్ శ్రీ బాసుదేవ్ సత్పథి, పర్యావరణ బోర్డు రీజనల్ ఆఫీసర్ (అంగూల్) అనూప్ కుమార్ మాలిక్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని తెలిపారు. 6 గ్రామాలకు చెందిన సుమారు 500 మంది స్థానికులు అందులో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అడ్వజర్ న్కెనీ బ్లాకు సీహెచ్.విజయారావు, కన్సల్టెంట్ ధరణిధరన్ నాథ్, ప్రాజెక్టు అధికారి రవీంద్ర చౌధరి, సింగరేణి అధికారులు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. 340 మిలియన్ టన్నుల బొగ్గు నిలువలు గల ఈ బ్లాకు నుంచి ఏడాదికి 100 లక్షల టన్నుల చొప్పున 38 ఏండ్లపాటు బొగ్గు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. అతితక్కువ వ్యయంతో అక్కడ బొగ్గు వెలికి తీయవచ్చునని పేర్కొన్నారు.
15 మెగావాట్ల సింగరేణి సోలార్ విద్యుత్ ప్రారంభం
రామగుండం-3 ఏరియా పరిధిలో నిర్మాణంలో ఉన్న 50 మెగావాట్ల సింగరేణి సోలార్ పవర్ ప్లాంటు నుంచి మరో 15 మెగావాట్ల సోలార్ విభాగాన్ని ట్రాన్స్కోకు బుధవారంనాడు అనుసంధానం చేసినట్టు సింగరేణి చైర్మెన్, ఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. రామగుండం-3 సోలార్ ప్లాంటులో 15 మెగావాట్ల విభాగాన్ని డైరెక్టర్ డి.సత్యనారాయణరావు, ట్రాన్స్కో సబ్ స్టేషన్కు అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆర్.జి.-3 ఏరియా జి.ఎం. కె.సూర్యనారాయణ, సోలార్ జీఎం డీవీఎస్ఎస్ఎన్ రాజు, బీహెచ్ఈఎల్, ఏజీఎం సుభాష్ భన్వాలికర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులో 300 మెగావాట్ల సింగరేణి సోలార్ విద్యుత్ను అందుబాటులోకి తెస్తామన్నారు.