Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) విమర్శించింది. పాసైన విద్యార్థులకు టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని టీపీఏ అధ్యక్షులు నాగటి నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాలేజీల దోపిడీకే సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. ఏడాదికి రూ.48,750 చొప్పున నాలుగేండ్లకు రూ.1,95,000 చెల్లించాలని విద్యార్థులను సీబీఐటీ యాజమాన్యం వేధిస్తున్నదని వివరించారు. కోర్సు పూర్తయిన విద్యార్థులు ఉన్నత చదువు కోసం, ఉద్యోగాల కోసం వెళ్లేందుకు సర్టిఫికెట్లు కావాలని అడిగితే అదనపు ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని సమాధానమిస్తున్నదని తెలిపారు. ఆర్మీలో ఉద్యోగానికి ఎంపికైన పవన్కృష్ణ అనే విద్యార్థి అలహాబాద్లో ఈనెల 28న టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు సమర్పించాలని పేర్కొన్నారు. విద్యార్థి తండ్రి కె భాస్కర్ రెండురోజులుగా కాలేజీ యాజమాన్యాన్ని సర్టిఫికెట్లు ఇవ్వాలని బతిమిలాడినా ఇవ్వడం లేదని వివరించారు. నవీన్ మిట్టల్ను కలిసి ఫిర్యాదు చేస్తే అదనపు ఫీజు కట్టి సర్టిఫికెట్లు తీసుకోవాలని సలహా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ కాలేజీ దోపిడీని అరికట్టాలనీ, నవీన్ మిట్టల్ తీరుపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.