Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్ను ముట్టడించిన రైతులు
- హద్దుల ఏర్పాటు విరమించుకోవాలని డిమాండ్
నవతెలంగాణ- పదర
కొన్ని దశాబ్దాలుగా పోడు భూమినే నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటున్న రైతులు అటవీ శాఖ అధికారుల ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా పదర మండల పరిధిలోని చిట్లంకుంట గ్రామంలో పోడు భూముల్లో కందకాలు ఏర్పాటు చేయడానికి అటవీశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న రైతులు బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో అటవీశాఖ అధికారులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు రైతులను చెదరగొట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు రైతులకు మద్దతుగా నిలిచి అటవీ శాఖ అధికారులతో భూసమస్యపై చర్చించారు. అనంతరం జెడ్పీటీసీ రాంబాబు నాయక్, ప్రజాప్రతినిధులు అటవీశాఖ అధికారులను వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. దానికి అంగీకరించిన అటవీశాఖ అధికారులు వారంలోపు ఏదో ఒకటి తేల్చి చెప్పాలని లేకుంటే.. మా పరిధి వరకు కందకాలు చేపడతామని చెప్పారు. అటవీశాఖ, రెవెన్యూ శాఖ మధ్య నిర్వహించాల్సిన సర్వేకు సంబంధించి ఏడీ రాకపోవడంతో సర్వేను వాయిదా వేశామని తాహసీల్దార్ కృష్ణయ్య తెలిపారు. ఇప్పటికే చిట్లంకుంట గ్రామస్థులు భూసమస్యపై హైకోర్టును ఆశ్రయించారని, కోర్టు స్టే వస్తే కానీ అటవీ హద్దుల సమస్య పరిష్కరమయ్యే అవకాశం ఉండదని తెలిపారు. తాము కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తుంటే.. అటవీశాఖ అధికారులు మాత్రం హద్దులు ఏర్పాటు చేసి కందకాలు తీస్తామని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ, రెవెన్యూ శాఖ మధ్య ఉన్న హద్దుల విషయంలో సర్వే నిర్వహిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనీ పలువురు అన్నారు.