Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు
- సమానపనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ - విలేకరులు
కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు, సిబ్బంది డిమాండ్ చేశారు. కేజీబీవీ, యుఆర్ఎస్ సమస్యల పరిష్కారం కోసం టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం అమలు చేయాలనీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనీ, విద్యార్థుల సంఖ్యను బట్టి అదనపు వంట వారిని నియమించాలని కోరారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ కేజీబీవీలో భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల, మేళ్లచెర్వు, తుంగతుర్తి, మఠంపల్లిలోనూ నిరసన తెలిపారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఎదుట ఉపాధ్యాయులు, సిబ్బంది నిరసన తెలిపారు. ఆత్మకూర్(ఎం)లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, పినపాక, దుమ్ముగూడెం, పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఆయా ఉపాధ్యాయులు బుధవారం భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసన తెలిపారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తూప్రాన్, చేర్యాల, మిరుదొడ్డి మండలాల్లో నిరసనలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, ఆసిఫాబాద్ కేజీబీవీ పాఠశాలల్లో యూఆర్ఎస్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు.
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కేజీబీవీ పాఠశాల ఎదుట సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ కేజీబీవీలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, రాయికల్ మండల కేంద్రాల్లోని కేజీవీబీల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని కేజీవీబీలో నిరసన తెలిపారు.