Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అక్రమ లే ఔట్లు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు చెందిన జీవో నెంబర్ 131, 152ల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీంలను సవాల్ చేస్తూ దాఖలైన పలు బ్యాచ్ పిటిషన్లను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఇవే అంశాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు ఉన్నందున అక్కడి కేసులు పరిష్కారం అయ్యే వరకూ తాము ఇక్కడి వ్యాజ్యాల విషయంలో విచారణ చేయబోమని చెప్పింది. ఎల్ఆర్ఎస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2020, ఆగస్టు 31న జీవోనెంబర్ 131, బీఆర్ఎస్ కోసం 2015, నవంబర్ 2న జారీ చేసిన జీవోనెంబర్ 152ను కొట్టేయాలని కోరుతూ పలు రిట్లు దాఖలయ్యాయి. ఆ జీవోలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇతరులు పిల్స్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ను ఫోరం ఫర్ గుడ్గవర్నెన్స్ మరొకరు సవాల్ చేశారు. వీటిపై విచారణ సందర్భంగా ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై సుప్రీంకోర్టులో ఉన్న వ్యాజ్యాల్లో అన్ని రాష్ట్రాలకూ నోటీసులు జారీ అయ్యాయనీ, విచారణ 8 వారాలకు వాయిదా వేసిందని చెప్పారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ల కోసం జీవోలిచ్చాయనీ, సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలనూ సుమోటోగా ప్రతివాదులుగా చేసి ఈ నెల 16న నోటీసులిచ్చిందని వివరించారు. సుప్రీంకోర్టు కేసు వివరాలను అందజేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది.ఎల్ఆర్ఎస్ జీవో గడువు ముగియనుందనీ, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే ప్రభుత్వం జీవోకు అనుగుణంగా చర్యలు తీసుకునే ప్రమాదం ఉంటుందని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. సుప్రీంకోర్టులో వివాదం పరిష్కారం అయ్యే వరకూ ఎల్ఆర్ఎస్పై చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇచ్చారు. వాదనల తర్వాత హైకోర్టు, పైవిధంగా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చింది. ఏజీ హామీని రికార్డుల్లో నమోదు చేసింది. విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.
చట్టప్రకారమే అక్రమ కట్టడాల కూల్చివేతలుండాలి :తేల్చి చెప్పిన హైకోర్టు
చట్ట నిబంధనలను అమలు చేయకుండా కూల్చివేత చర్యలకు పాల్పడంపై రెవెన్యూ శాఖపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చట్టానికి లోబడే కూల్చివేతలు ఉండాలని తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏకపక్షంగా కూల్చివేత నిర్ణయాలు తీసుకున్నారని తప్పుపట్టింది. అక్రమంగా కూల్చివేసిన ప్రహరీ, సర్వెంట్ క్వార్టర్లను తిరిగి నిర్మించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని సర్వే 44/1లోని 2415 చదరపు గజాల స్థలాన్ని ఎం బాపిరాజు అనే వ్యక్తి 2004లో రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశారు. అప్పటికే స్థలానికి ప్రహరీ, సర్వెంట్ క్వార్టర్లు ఉన్నాయి. ఇది ప్రభుత్వ భూమని చెప్పి అధికారులు వాటిని కూల్చివేశారు. దీనిని సవాల్ చేస్తే.. నోటీసు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారనీ, వెంటనే వాటిని ఆరు నెలల్లోగా నిర్మించాలని సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్కు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం అప్పీల్ చేసిన వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ విజరుసేన్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ పైవిధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విచారణను మార్చి 17కి వాయిదా వేసింది.