Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్గత విశ్లేషణకు సబ్ గ్రూపులు : సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రక్రియ చేపట్టేందుకుగానూ అంతర్గత విశ్లేషణ కోసం సబ్ గ్రూపులను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. సులభతర వాణిజ్య నిబంధనల తయారీలో అమలవుతున్న పారిశ్రామిక, వర్తక ప్రోత్సాహక నిబంధనలు, చట్టాలను పరిశీలించాలని సూచించారు. రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, అనుమతులు జారీ, తనిఖీలు, రికార్థులు, ఫైలింగ్, తదితర అంశాలకు సంబంధించి కాంప్లియెన్సెన్ భారాన్ని తగ్గించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించడానికి రెవెన్యూ(వాణిజ్య పన్నుల మరియు ఎక్సైజ్ ) , పౌరసరఫరాల శాఖ, రవాణా, ఎనర్జీ, హౌం, పురపాలక, కార్మిక, ఉపాధి శిక్షణ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలు అంతర్గతంగా విశ్లేషించి సబ్ గ్రూప్లను ఏర్పాటు చేసి ప్రాసెస్ పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ డీపీఐఐటీ రాష్ట్రానికి సంబంధించి చట్టాలు, రెగ్యులేషన్లను షేర్ చేసిందనీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి ప్రాసెస్ను సులభతరం చేయటానికి చర్యలు తీసుకోవాలని కోరిందని తెలిపారు.
ఈ సమావేశంలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హౌం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, పౌరసరఫరాల శాఖ ఈఓ కార్యదర్శి అనిల్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితర అధికారులు పాల్గొన్నారు.