Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో కాలుష్యం వెలువరించే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఆ ప్రాంతంలో మొత్తం ఎన్ని పరిశ్రమలున్నాయో, ఎన్నింటికి నోటీసులిచ్చారో, ఎన్ని పరిశ్రమలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయో, ఎన్ని పరిశ్రమలు కాలుష్య నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయో పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాలుష్య నియంత్రణ మండలిని హైకోర్టు ఆదేశించింది. జీడిమెట్లలో భూగర్భ జాలాలు కాలుష్యమైనట్టు ఒక పత్రికలో వచ్చిన వార్తను హైకోర్టు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యంగా విచా రణ చేపట్టింది. ఇదే తరహాలో మరొకరు వేసిన పిల్ను కూడా కలిపి సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బి.విజరుసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆ ప్రాంతంలోని 45 పరిశ్రమలకు నోటీసుల ఇచ్చామనీ, 16 పరిశ్రమలు ఇచ్చిన జవాబులు సంతృప్తికరంగా ఉన్నందున వాటి విషయంలో చర్యలు తీసుకోలేదని కాలుష్య నియంత్రణ మండలి తరఫు న్యాయవాది చెప్పారు. మిగిలిన పరిశ్రమలపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జీడిమెట్లలో 45 పరిశ్రమలే ఉన్నాయా? ఈ విషయాన్ని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేయమంటారా? అని ధర్మాసనం అడిగింది. కాలుష్య నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే కంపెనీలకు నోటీసులు ఇచ్చి రెండు నెలల్లోగా చర్యలు తీసుకోవాలనీ, 10 వారాల్లోగా కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.
రైతు సంఘం నేటి ర్యాలీకి అనుమతి
రైౖతు చట్టాలకు వ్యతిరేకంగా డిల్లీలో రైతుల ఉద్యమానికి సంఘీభావంగా మంగళవారంనాడు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నిర్వహించబోయే ర్యాలీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్కు ఉత్తర్వులిచ్చింది. సరూర్నగర్ స్టేడియం నుంచి ఉప్పల్ స్టేడియం వరకు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ర్యాలీ నిర్వహించుకోవాలనీ, ర్యాలీలో ట్రాక్టర్లు వినియోగించబోమన్న హామీని అమలు చేయాలని చెప్పింది. ర్యాలీలో ఇతర వాహనాలైన కార్లు, మోటారు సైకిళ్లు 300కు మించకూడదని సూచించింది. తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి పి. పద్మ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ సోమవారం విచారణ జరిపారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నిర్వహించే ర్యాలీకి సంఘీభావంగా 26వ తేదీన ఇందిరాపార్క్ నుంచి నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా లేదా నిజాం కాలేజీ గ్రౌండ్స్ వరకూ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ లాయర్ రఘునాథ్ కోరారు. నగర నడిబొడ్డున ర్యాలీ నిర్వహిస్తే ట్రాఫిక్ సమస్యలతో జనం ఇబ్బందులు పడతారని ప్రభుత్వ లాయర్ అభ్యంతరం చెప్పారు. ఇరుపక్షాలు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించాలని హైకోర్టు సూచన చేసింది.. శంషాబాద్ దగ్గర్లోని పెద్ద గోల్కొండ విలేజ్ నుంచి పఠాన్చెరు వరకూ ఔటర్ రింగ్ రోడ్లో ర్యాలీ తీస్తామంటే అందుకు 57 కిలోమీటర్ల మేరకు ప్రత్యేక జీబ్రా లైన్లు వేస్తామని ప్రభుత్వ లాయర్ చెప్పారు.