Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం, ప్రముఖులు వ్యాక్సిన్ సురక్షితమని పదే పదే చెబుతున్నా టీకా వేసుకునేందుకు వైద్య సిబ్బందిలో ఆందోళన పూర్తిగా తొలగడం లేదు. మొదటి రోజు 90 శాతంపైగా టీకా తీసుకోగా సోమవారం నాటికి అది కాస్తా 47 శాతానికి పడిపోయింది. టీకా వేసుకునేందుకు ప్రయివేటు వైద్య సిబ్బంది ముందుగానే పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో సోమవారం 42,915 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. వారిలో కేవలం 20,359 మంది (47.4 శాతం) మాత్రమే ముందుకు రాగా మిగిలిన వారు దూరంగా ఉండిపోయారు. సోమవారం పలు కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు వ్యాక్సిన్ తీసుకున్నారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి (ఆసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మెన్ ), డాక్టర్ ఎవిట ఫెర్నాండేజ్ (ఫెర్నాండేజ్ హాస్పిటల్), హైదరాబాద్ జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ వెంకటి, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ గోపాలక్రిష్ణ గోఖలే తదితరులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 495 కేంద్రాల్లో టీకా ఇవ్వగా, ఐదుగురు స్వల్ప అస్వస్థతకు లోనైనట్టు గుర్తించారు. వెంటనే వారికి చికిత్స అందించగా, వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మంగళవారం గణతంత్ర దినోత్సవం, బుధవారం రెగ్యులర్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలు ఉన్నందున ప్రయివేటు వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ నెల 28న తిరిగి కొనసాగించనున్నారు.
0.74 శాతం మందికి కరోనా
రాష్ట్రంలో చేసిన టెస్టుల్లో 0.74 శాతం మందిలో కరోనా వైరస్ ఉన్నట్టు బయటపడింది. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో 19, 821 నమూనాలకు టెస్టులు చేశారు. వీరిలో 148 మంది కోవిడ్-19 బారిన పడ్డట్టు పరీక్షల్లో వెల్లడైంది. తాజాగా ఒకరు మరణించడంతో ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1590కి చేరింది. ప్రస్తుతం 3,234 యాక్టివ్ కేసులున్నాయి. మరో 260 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నవి.
ఆరు జిల్లాల్లో జీరో.....
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో తాజాగా భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. జీహెచ్ఎంసీలో 35, రంగారెడ్డి జిల్లాలో 11, కరీంనగర్ లో 10 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, సిద్ధిపేట జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున వ్యాధి బారిన పడ్డారు.
6.6 శాతమే ఆక్యుపెన్సీ
రాష్ట్రంలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 62 కోవిడ్-19 ప్రత్యేక ప్రభుత్వాస్పత్రుల్లో 8577 బెడ్లకుగాను 573 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. 218 ప్రయి వేటు ఆస్పత్రుల్లో 7753 బెడ్లుండగా అందులో 946 మంది ఉన్నారు. మొత్తం యాక్టివ్ కేసులు 3,234లో ఆస్పత్రుల్లో 1537 మంది చికిత్స పొందుతుండగా అంతకన్నా ఎక్కువగా 1697 మంది ఇంటికి పరిమితమై ఉన్నారు.