Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలనీ, పసుపు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్లో ఈ నెల 30న ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో అసెంబ్లీ మీడియా పాయింట్లో సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. పసుపు బోర్డు, గిట్టుబాటు ధర ఏమయ్యాయని ఎంపీ అరవింద్ను ప్రశ్నించారు. పసుపు రైతులకు మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పసుపు రైతును నిండా ముంచుతున్నారని విమర్శించారు. మూతబడ్డ చెరుకు ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలతో పంటల మద్దతు ధరకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వెలిబుచ్చారు. మోడీ దగ్గర విశ్వసనీయత పెంచుకునే పనిలో కేసీఆర్ పడ్డారనీ, అందుకే వ్యవసాయ మార్కెట్ల ఆదాయం తగ్గినా రాష్ట్రం భరిస్తుందని మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైస్మిల్లర్లకు ఏజెంట్గా మారిందని ఆరోపించారు. రైతుబంధు ఇస్తూ రైతాంగానికి సంబంధించిన ఇతర ప్రయోజనాలను పక్కబెట్టారని విమర్శించారు. రూ. 25 వేల లోపు పంట రుణాలను మాత్రమే మాఫీ చేశారు..మిగిలిన రైతుల పరిస్థతి ఏంటి? అని ప్రశ్నించారు. సన్నబియ్యానికి సబంధించి ప్రస్తుతం ఎకరానికి రూ. 4 వేల నుంచి రూ.5 వేల వరకు నష్టపోతున్నాడన్నారు.