Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నందిపేట్
పెండ్లి చేసుకొని కడవరకూ కలిసుండాలని కలలు కన్నారు. ప్రేమ విషయం ఇండ్లల్లో తెలియడంతో మందలించారు. పెండ్లి చేయబోమని కరాఖండిగా చెప్పారు. దాంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. విషయం తెలుసుకున్న యువకుడు గ్రామ పొలిమేరలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటనలు నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో సోమవారం జరిగాయి. ఎస్ఐ శోభన్బాబు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఐలాపూర్ గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ (22), ఖుద్వాన్పూర్కు చెందిన డికంపల్లి సుకన్య (21) జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. ఇరువురిదీ ఒకే మండలం కావడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. ఆ విషయం పెద్దలకు తెలియడంతో ఇద్దరిని మందలించి వదిలేశారు. ఐతే సుకన్య తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
దాంతో మనస్తాపానికి గురైన సుకన్య తన ఇంట్లో సోమవారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ప్రేమ్కుమార్.. నీ వెంటే నేనంటూ గ్రామ పొలిమేరలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. స్థానిక ఎస్ఐ శోభన్బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇరువురి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.