Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ సంచాలకులకు టీఎస్టీటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏజెన్సీ ప్రాంతంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వంద శాతం పదోన్నతులు గిరిజన ఉపాధ్యాయులకే ఇవ్వాలని టీఎస్టీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియాన జడ్చోగ్తును సోమవారం హైదరాబాద్లో టీఎస్టీటీఎఫ్ అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్నాయక్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈనెలాఖరులోపు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో వందశాతం పదోన్నతులు గిరిజన ఉపాధ్యాయులకు ఇవ్వాలని హైకోర్టు 2014, ఏప్రిల్ 29న ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ ఆదేశాలకు లోబడి గిరిజన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేలా జాబితాను తయారు చేయాలని కోరారు. మెరిట్ కం రోస్టర్ ప్రకారం మైదాన ప్రాంతంలో పదోన్నతులు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీటీఎఫ్ నాయకులు ఎన్ శోభన్, బి ఈరునాయక్, భూక్యశంకర్, బి పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు.