Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్ యూనియన్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్సీలో సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని టీఎస్సీపీఎస్ యూనియన్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 1.50 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల పింఛన్ సమస్య విధానంపై చర్చించుటకు తమకు త్రిసభ్య కమిటీ అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో ఉమ్మడ ఏపీలో పీఆర్సీ కమిటీల్లో సీపీఎస్ విధానంపై సరైన న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర మొదటి పీఆర్సీ కమిటీ, త్రిసభ్య కమిటీ ఉద్యోగుల సంక్షేమంపై సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్ ఉద్యోగులకు అమలు చేస్తున్నట్టు కుటుంబ పింఛన్-1972 నిబంధనల ప్రకారం అమలు చేయాలని తెలిపారు. ఈ సీపీఎస్ విధానం వల్ల ఏటా రూ.900 కోట్లు స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఎన్ఎస్డీఎల్ ద్వారా షేర్ మార్కెట్లోకి వెళ్తున్నాయనీ, దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ విధానం రద్దు పరచడం వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందనీ, పింఛన్లపై వ్యయం తగ్గుతుందని వివరించారు. సీపీఎస్ నుంచి ఎలా బయటికి రావచ్చో త్రిసభ్య కమిటీకి వివరిస్తామని తెలిపారు.