Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదాయ అంచనాలు.. వాస్తవాల్లో 20 నుంచి 30 శాతం తేడా
- అయినా బడ్జెట్ను పెంచుతూ పోతున్న సర్కార్
- 2014 నుంచి ఇదే వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన కొత్తలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అక్షరాలా రూ.లక్షా 637 కోట్లు. ఐదేండ్లు గడిచిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2020-21)కి సమర్పించిన పద్దు రూ.లక్షా 82 వేల కోట్లు. అంటే ఐదేండ్ల కాలంలో మన బడ్జెట్ రూ.81 వేల కోట్ల మేర పెరిగిందన్నమాట. ఈ రకంగా టీఆర్ఎస్ సర్కారు ఏడాదికేడాది అంచనాలను భారీగా పెంచుకుంటూ పోతున్నప్పటికీ వాస్తవంలో మాత్రం వాటిని చేరుకోలేకపోతున్నది. ఈ క్రమంలో బడ్జెట్లో రెవెన్యూ ఆదాయానికి సంబంధించి ప్రభుత్వం వేసుకుంటున్న అంచనాలు, వాస్తవంగా వచ్చిన రాబడికి మధ్య 20 శాతం 30 శాతం వరకూ వ్యత్యాసం ఉంటున్నది. ఒకట్రెండు సందర్భాల్లో తప్ప మిగతా అన్ని సంవత్సరాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. 2014 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ల తీరు తెన్నులను పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతున్నది. అధికారిక లెక్కలే ఈ వాస్తవాలను విశదీకరిస్తుండటం గమనార్హం.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ బడ్జెట్ అంచనాలు భారీగా పెరుగుతూ పోతున్నాయి. అయితే పద్దులను ప్రవేశ పెట్టే సమయంలో వాస్తవాల ఆధారంగానే బడ్జెట్ను రూపొందిస్తున్నామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఆర్థిక మంత్రులు చెబుతూ వస్తున్నారు. కానీ మరుసటి ఏడాది బడ్జెట్ను, ఆ సందర్భంగా గతేడాది ఎంత రెవెన్యూ ఆదాయం వచ్చిందనే విషయాన్ని పరిశీలిస్తే మాత్రం వారి మాటలు వాస్తవానికి దూరంగా ఉన్నాయనే విషయం ఇట్టే తెలిసిపోతున్నది. ఇలా వాస్తవ ఆదాయాలు, రాబడులకు విరుద్ధంగా పద్దును పెంచి చూపటం... తద్వారా ప్రజల్లో భ్రమలు కల్పించటం సరికాదంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. వారి సలహాలు, సూచనలను ఖాతరు చేయకుండా అంచనాలను అమాంతం పెంచుతూ పోతున్నారు. అయితే వీటికి అనుగుణంగా రెవెన్యూ రాబడులు లేకపోవటంతో కేటాయింపులను ఆ తర్వాత భారీగా కుదిస్తున్నారు. పరిస్థితి ఈ విధంగా ఉండగా మనది మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రమంటూ అదే ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతుండటం గమనార్హం. రెండంకెల వృద్ధి అంటూ వారు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించటం ఆనవాయితీగా మారింది. ఈ తీరు మారాలనీ... లేదంటే రాష్ట్రానికి మున్ముందు తీరని నష్టం వాటిల్లుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇంకో ఏడాది పట్టొచ్చు : డాక్టర్ అందె సత్యం - ఆర్థిక విశ్లేషకులు
'కరోనా లాంటి ఏదైనా అనుకోని విపత్తు రాకపోతే సాధారణ పరిస్థితుల్లో బడ్జెట్ పరిమాణం... ప్రతీ ఏడాది 10 శాతం పెరుగుతూ పోతుంది. కానీ కోవిడ్ నేపథ్యంలో గతేడాదితో పోల్చితే మాత్రం ఆదాయం సుమారు రూ.40 వేల కోట్లు తగ్గనుంది. ఫలితంగా బడ్జెట్ వాస్తవ రూపం తక్కువగా ఉండే అవకాశముంది. ప్రస్తుత బడ్జెట్లో చెప్పినట్టుగా రూ.1.82 లక్షల కోట్ల పద్దు నిజం కావాలన్నా, అంత ఆదాయం రావాలన్నా ఇంకో ఏడాది పట్టొచ్చు. కాబట్టి శాఖల కేటాయింపులు కూడా కచ్చితంగా రూ.40 వేల కోట్ల వరకూ తగ్గే అవకాశముంది. కోవిడ్తోపాటు ఇతరత్రా కారణాల వల్ల సర్కారు ఆదాయం పడిపోయింది. అందువల్ల ప్రస్తుతం రూ.1.82 లక్షల కోట్లతో ఉన్న బడ్జెట్ వాస్తవ రూపంలో రూ.1.50 లక్షల కోట్లకే పరిమితం కావొచ్చు...'