Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండలో ఇద్దరు.. తుర్కపల్లిలో రైతు..
నవతెలంగాణ-నల్లగొండ/తుర్కపల్లి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు ఆదివారం రాత్రి దారుణంగా హత్యకు గురయ్యారు. నల్లగొండ పట్టణ కేంద్రంలో ఇద్దరు, తుర్కపల్లి మండలంలో ఒకరి హత్య జరిగింది. నల్లగొండ టూటౌన్ ఎస్ఐ నర్సింహులుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..
నల్లగొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్ రాంనగర్ పార్క్ సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. సోమవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. అక్కడ ఉన్న మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఇతర రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల వయస్సు 35-40 మధ్య ఉంటుంది. మృతదేహాలను జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్లో పొలానికి నీళ్లు ఇవ్వలేదని రైతును చంపేశారు. ఏసీపీ నర్సింహారెడ్డి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ గ్రామానికి చెందిన తూటి రామచంద్రయ్య (56)కు గ్రామ శివారులో రెండెకరాల భూమి ఉంది. ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహమ్మద్ ఇబ్రహీంకు రామచంద్రయ్య అన్నదమ్ములకు మధ్య భూవివాదం ఉండగా కొన్ని నెలల కిందట పరిష్కారం చేసుకున్నారు. అందులో ఇబ్రహీంకు ఎకరం భూమి వచ్చింది. ఆ భూమిలో వ్యవసాయం కోసం నీళ్లు లేకపోవడంతో రామచంద్రయ్య బోరు నుంచి పెట్టుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని రామచంద్రయ్యను అడిగాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి రామచంద్రయ్య పొలం వద్ద ఉండగా, ఇబ్రహీం, అతని ఇద్దరు కొడుకులు ఇలియాస్, ఇంతియాజ్ మద్యం తీసుకుని వెళ్లి అక్కడ తాగారు. ఆ తర్వాత పొలానికి నీళ్లు అడిగారు. అయితే, తన పొలానికే సరిపోవడం లేదని రామచంద్రయ్య చెప్పాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అదే సమయంలో కర్రతో రామచంద్రయ్య తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఏసీబీ నర్సింహారెడ్డి, సీఐ నరసింహ, ఎస్ఐ మహేష్ బాబు, క్లూస్ టీం సంఘటనా స్థలంలో పరిశీలించారు. మృతుని తమ్ముడు తోటి సంజీవ.. తన అన్నను ఇలియాస, ఇంతియాజ్, ఇబ్రహీంలే హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియాస్పత్రికి తరలించారు. ఇబ్రహీంను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతని ఇద్దరు కొడుకులు పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.