Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిర్చి క్వింటాలు ధర 20వేలు
- వరదల ప్రభావంతో పెరుగుతున్న రేట్లు
- కారంపొడిదీ అదే పరిస్థితి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని పంటలు బాగా దెబ్బతిన్నాయి. మరికొన్ని పంటలు చేతికందలేదు. ముఖ్యంగా మిర్చి పంట వరదలకు దెబ్బతినడంతో దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తున్నది. ప్రతి రోజూ వినియోగించే మిర్చికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. వరదలతో పంట దిగుబడి తగ్గిపోవటంతో గిరాకీ పెరుగుతున్నది. మిర్చి క్వింటాలు ధర 20వేలు పలుకుతున్నది. గతేడాది కంటే ఈ ధర రికార్డు స్థాయికి చేరుకున్నది. క్రమంగా ధర పెరుగుతూనే ఉన్నది. వ్యవసాయ మార్కెట్కు కొత్త మిర్చి రాక ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం, మలక్పేట్ మార్కెట్లలో కొత్త దానికి భారీగా ధరలు పలుకుతున్నాయి.
కొత్త మిర్చికే డిమాండ్
సాధారణంగా పాత మిర్చికి ధరలు పలికేవి. కానీ ఈఏడాది కొత్త మిర్చికి కూడా ధరలు పెరగటం విశేషం. మొదటి పంట కోత ఇప్పుడిప్పుడే మార్కెట్కు వస్తున్నది. ఖమ్మం మార్కెట్కు మిర్చి రైతులు ఎక్కువగా పంటను తెస్తున్నారు. ధర కూడా ఉండటంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో మిర్చి ధరలు జోరందుకుంటున్నాయి. వరంగల్ మార్కెట్లో యుఎన్ 341 రకానికి క్వింటాలు ధర రూ 20వేలు పలికింది. అదే మార్కెట్లో వండర్హాట్ రకానికి క్వింటాల్ రూ 19వేలు ధర వలికింది. మలక్పేట్ మార్కెట్లో నవంబర్లో వన్ మిర్చి రకానికి క్వింటాల్ రూ 16వేల ధర పలికింది. ఖమ్మం మార్కెట్లో తేజ రకానికి క్వింటాల్ రూ15,685 అత్యధిక ధర పలుకుతున్నది. రాష్ట్రంలో అత్యధికంగా రూ 20వేలు పలుకగా, మోడల్ ధర ఒక్కో మార్కెట్లో రూ13వేలు, రూ 15వేలు, రూ 16వేల చొప్పున ధర కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
సాగు పెరిగినా...దిగుబడి అంతంతే...
ఈఏడాది మిరప పంట ఎక్కువగా సాగుచేసినా...వర్షాలు, వరదలతో పంటకు పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. రాష్ట్రంలో మిరప సాధారణ సాగు 1.98లక్షల ఎకరాలు కాగా, ఈసారి 2.50 లక్షల ఎకరాల్లో మిర్చిని సాగు చేశారు. ఎక్కువగా ఖమ్మంలో 56వేల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 45వేలు, భూపాలపల్లి జిల్లాలో 18,454, వరంగల్ రూరల్లో 13,472, సూర్యాపేట 12,418 ఎకరాలు సాగు చేశారు. పంట దిగుబడి 4.16లక్షల టన్నుల దిగుబడిగా అంచనా వేశారు. అకాల వర్షాలతో పంట దిగుబడిపై ప్రభావం చూపాయి. పంట దిగుబడి గతేడాది 3.70లక్షల టన్నులు రాగా, ఈసారి దిగుబడి 3లక్షల టన్నులకు మించి వచ్చే అవకాశం లేదని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా దిగుబడి తగ్గినా మిర్చికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గతేడాది ఇదే సమయానికి రూ 22,500 వరకు ధర పలుకగా 2021లో మించిపోయే అవకాశం ఉందంటున్నారు. తాలు మిరపకాయలకు కూడా గిరాకీ బాగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో తాలు మిర్చి అత్యధికంగా క్వింటాల్ రూ 7,000 ధర పలికింది. గత ఏడాది అత్యధికంగా తాలు మిర్చి క్వింటాల్ రూ 10వేలు పలికి రికార్డు సష్టించింది.
విదేశాల్లోనూ డిమాండ్
జపాన్, చైనా, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో మన మిర్చికి మంచి డిమాండ్ ఉన్నది. మిర్చి నుంచి నూనె తీసి వివిధ రకాల రసా యనాలు, రంగుల తయారీకి వినియోగిస్తున్న నేప థ్యంలో మరింత డిమాండ్ పెరగనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పండిస్తున్న రకాల్లో బ్యాగిడి రకాన్ని రంగుల్లో ఎక్కువగా వినియోగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ రకం మిర్చికి రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి.