Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యవసాయ సాంకేతిక పరికరాలు రైతులందరికి అందుబాటులో ఉంచాలని ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్ రావు అన్నారు. ఆర్టీసీ క్రాస్రోడ్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్, అధ్యక్షులు పి.జంగారెడ్డి, మాజీ శాసనసభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, సహాయ కార్యదర్శి మాదినేని లక్ష్మి, రవీందర్, రాహుల్ తో కలిసి ఆయన 2021 చైతన్య సేద్యం డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరిబండి ప్రసాద్ రావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మహిళలకు, రైతులకు ఉపయోగపడే నూతన సాంకేతిక పరికరాలు గ్రామీణ ప్రాంతాల వరకు అందుబాటులో ఉంచాలని కోరారు. పరిశోధనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించి కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తద్వారా ఉత్పాదకత పెరిగి ఆహార భద్రత మెరుగవుతుందని అన్నారు. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రైతాంగం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామి ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్వామి నాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్ధతు ధరల చట్టం చేయాలని కోరారు. రైతుల ఆత్మహత్యలను నివారించటానికి కేరళ తరహాలో రుణ విమోచన చట్టం చేయాలని అన్నారు. ఈ డైరీని రైతు నాయకులకు, కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా సమాచారంతో రూపొందించారనీ, చైతన్య సేద్యం మాస పత్రికను రైతులందరూ ఆదరించాలని కోరారు.