Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ల చెర నుంచి వ్యవసాయాన్ని,రైతును కాపాడుకుంటాం :రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
- ఇబ్రహీంపట్నం చేరుకున్న రైతుసంఘం రాష్ట్ర బస్సు యాత్ర
- ట్రాక్టర్లతో స్వాగతం పలికిన రైతులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన నల్ల సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల్లో కొనసాగింది. ఈ యాత్రకు స్థానిక రైతులు ట్రాక్టర్లతో స్వాగతం పలికారు. ఆయా మండలాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడారు. చట్టాల రూపకల్పన చేయడానికి ముందురోజు మోడీ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకే రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. వాటివల్ల వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి రైతును బజారున పడేయాలని మోడీ సర్కారు చూస్తోందని ఆరోపించారు. 136 కోట్ల జనాభా కలిగిన దేశంలో 70కోట్ల మంది రైతు కుటుంబాలకు చెందినవారేననీ, వారంతా ఒక పూట తింటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారన్నారు. 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో 60 రోజులుగా ఢిల్లీ నగరంలో లక్షలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సంఘటిత ఉద్యమాలతో కార్పొరేట్ల చెర నుంచి వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకుంటామని చెప్పారు. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో పరెేడ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదామని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ.. వ్యవసాయరంగంపై అనేక వృత్తులు ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. ఈ చట్టాలు అమలైతే వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతారన్నారు. వ్యవసాయ కార్మికులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మధుసూదన్రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కోర్ కమిటీ సభ్యులు సామెల్, వ్యకాస జిల్లా కార్యదర్శి జగన్, రైతు సంఘం నాయకులు ముసలయ్య, వెంకటేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్, ముగ్గరాములు, కేవీపీఎస్ నాయకులు ప్రకాశ్కారత్ పాల్గొన్నారు.