Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం తగదు
- అభివృద్ధి కోసం జెడ్పీటీసీలకు రూ.50 లక్షలివ్వాలి
- ఫిబ్రవరి 12న ఆత్మగౌరవ సభ : జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'తాము బాధ్యతలు చేపట్టి 19 నెలలు అవుతున్నది. ఇప్పటిదాకా ఒక్కపైసా నిధులు కూడా విడుదల కాలేదు. ఊర్లల్లో ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితి. స్థానిక సంస్థల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు సరిగాదు. గాంధీ చెప్పినట్టు గ్రామస్వరాజ్యం రావాలంటే పల్లెలను అభివృద్ధి చేయాలి. అందుకోసం నిధులివ్వాలి. అభివృద్ధి కోసం జెడ్పీటీసీలకు ప్రత్యేకంగా రూ.50 లక్షలు కేటాయించాలి' అని జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నాడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీటీసీలకు అధికారాలు బదిలీ చేయాలనీ, నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న హైదరాబాద్లో జెడ్పీటీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. జిల్లా పరిషత్లను జిల్లా ప్రభుత్వాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి జెడ్పీటీసీలకు 25 శాతం నిధులు కేటాయించాలని కోరారు. జెడ్పీటీసీల సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కె.నగేశ్ మాట్లాడుతూ నిధుల్లేక గ్రామాల్లో సమస్యలు ఎక్కడికక్కడే తిష్టవేశాయన్నారు. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి లేకుండా స్థానిక సంస్థలకు అధికార వికేంద్రీకరణ జరగాలని కోరారు. జెడ్పీటీసీలకు కనీసం ఓ చాంబర్ లేకపోవడం దారుణమన్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో జెడ్పీటీసీలకు ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ జెడ్పీటీసీలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. జెడ్పీటీసీలకు ట్రావెల్ అలవెన్స్లు ఇవ్వాలనీ, టోల్గేట్ల వద్ద చార్జీల మినహాయింపును వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు తోటకూర అనురాధ, పి.సుధారాణి మాట్లాడుతూ జెడ్పీటీసీలమంతా ఉత్సవ విగ్రహాలుగా మారామన్నారు. 29 అధికారాలను బదిలీ చేయాలనీ, జెడ్పీటీసీలకు అవగాహన సదస్సు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్లలో సరైన సంఖ్యలో అధికారులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎంపీపీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చీర శ్రీశైలం మాట్లాడుతూ..యాదగిరిగుట్ట మండలంలో 23 గ్రామపంచాయతీలుంటే ఎంపీటీసీలకు రూ. 2.70 లక్షలు నిధులొస్తున్నాయనీ, గ్రామాలవారీగా పంచితే 12 వేలు కూడా రావట్లేదని తెలిపారు. అందులోనూ 50 శాతం పాఠశాల అభివృద్ధి కోసం పోతే గ్రామంలో ఏం అభివృద్ధి చేయాలని ప్రశ్నించారు.