Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం : ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి కెకె దివాకరన్
- తెలంగాణ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో రవాణారంగం సంక్షోభంలో పడిందని అఖిల భారత రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) ప్రధాన కార్యదర్శి కెకె దివాకరన్ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండడంతో రవాణారంగంపై ఆధారపడ్డ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధరలకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమం చేపడతామని పిలుపునిచ్చారు. తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేటు రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ నూతన క్యాలెండర్ను సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దివాకరన్ మాట్లాడుతూ రవాణా రంగ కార్మికుల జీవితాలను, రవాణా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కుటుంబాల పోషణకు తగిన ఆదాయం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలు రుణ వాయిదాలను చెల్లించాలని కార్మికులపై ఒత్తిడి చేస్తున్నాయని గుర్తు చేశారు. దీంతో కొంత మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల రవాణా సంస్థలు ఆర్థిక సంక్షోభంలో పడ్డాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తిరోగమన విధానాలను నిరసిస్తూ ఐక్యపోరాటాలను నిర్వహించాలని కోరారు. దేశంలో రోడ్డు రవాణా పరిశ్రమ ఎక్కువగా ఆటోరిక్షా, ట్యాక్సీ, ట్రక్, ప్రయివేటు బస్సులలో ఒకటి లేదా రెండు వాహనాలను యజమాని కమ్ డ్రైవర్గా కలిగి ఉందని వివరించారు. ఇంధన ధరలు, బీమా ప్రీమియం, టోల్ చార్జీలు, వాహన పన్ను, ఇతర ఖర్చులు భారీగా పెరగడంతో లక్షలాది ట్రాన్స్పోర్టు యజమానులు దివాళా తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందన్నారు. ఎంవీ యాక్ట్ చట్టసవరణ చిన్న యజమానులను దివాళా తీయించిందని చెప్పారు. ప్రజారవాణాను, గూడ్స్ ట్రాన్స్పోర్టును స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పగించడం రవాణా పరిశ్రమకు అత్యంత ప్రమాదకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య, కార్యదర్శి విఎస్ రావు, ఉపాధ్యక్షులు అన్బజగన్, రాజన్, కుట్టి, తెలంగాణ పబ్లిక్, ప్రయివేటు రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి శ్రీకాంత్, కోశాధికారి అజరుబాబు, నాయకులు మల్లయ్య, గంగాధర్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.