Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి ఢిల్లీ ర్యాలీ కేంద్రానికి సిగ్గుచేటు
- మోడీకి పతనం తప్పదు : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్
- పోడుకు పట్టా వచ్చేదాకా పోరు : తమ్మినేని వీరభద్రం
నవతెంలంగాణ-కొత్తగూడెం
రైతులతో పెట్టుకున్న మోడీకి పతనం తప్పదని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్ అన్నారు. పోడు సాగుదారులకు పట్టాలివ్వాలనీ, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నిర్వహించిన పోడు సాగుదారుల ప్రజాగర్జన యాత్ర లక్ష్మీదేవిపల్లి మండలం మార్కెట్ యార్డ్ నుంచి కలెక్టరేట్ ధర్నా చౌక్ వరకు సాగింది. ప్రదర్శన ముందు భాగాన ఉన్న జిల్లా ఆదివాసీల కొమ్మునృత్యాలు, పీఎన్ఎం కళాకారులు, హిజ్రాల నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎరుపుమయంగా మారింది. ఈ ప్రదర్శన, బహిరంగసభకు సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్నాచౌక్లో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. బృందాకరత్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతులను సంప్రదించకుండా ఆదానీ, అంబానీల కోసమే రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. దేశంలో గణతంత్ర దినోత్సవం రోజున లక్ష ట్రాక్టర్లతో అన్నదాతలు చేపట్టే నిరసన ర్యాలీ మోడీ ప్రభుత్వానికి గొడ్డలిపెట్టన్నారు. ఢిల్లీలో 60 రోజులుగా రైతులు చేస్తున్న నిరసన పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని, దానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దుచేయా లనీ, రైతులకు అండగా నిలిచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులు చేస్తున్న ఆందోళన దేశచరిత్రలో నిలిచిపోతుందని స్పష్టంచేశారు. రైతులు వారి కుటుంబాలు, పిల్లలను విడిచిపెట్టి వచ్చి ఢిల్లీలో పోరాటం చేస్తున్నారని, ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయ కుండా చేస్తున్న పోరాటానికి ఎల్లవేళలా మద్దతు ఉంటుంద ని చెప్పారు. ఆదివాసీలకు జీవన, మరణ సమస్యగా మారిన పోడు సాగు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను మోసం చేస్తున్నారన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కమ్యూనిస్టుల సహకారంతో తీసుకువచ్చిన అటవీహక్కుల చట్టానికి కేంద్రం తూట్లుపొడుస్తున్నదని విమర్శించారు. ఈ చట్టం పోరాడి సాధించుకున్నదనీ, మోడీ అయ్య తెచ్చిన చట్టం కాదన్నారు. అటవీ హక్కుల చట్టం ఉన్నంతవరకూ పోడుభూములు ఆదివాసులకు చెందుతాయనీ, దశాబ్దాలు గా సాగుచేసుకుం టున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ తమ్ముడు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రాత్రి ఒక మాట.. సాయంత్రం ఒక మాట తీరున వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ్మినేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో సాగుదారు లకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి హరితహారం పేరుతో భూములను లాక్కుని కుటిల రాజకీయాలకు టీఆర్ ఎస్ పాల్పడుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 2లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు సగం కూడా ఇవ్వలేదన్నారు. ఆదివాసీ, గిరిజనులకు సీపీఐ(ఎం) వెన్నంటి ఉంటుందనీ, పోడు సాగుదారులకు పట్టాలు ఇచ్చేంత వరకూ ప్రాణాలైన లెక్కచేయకుండా పోరాటం నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఆదివాసీలు అడవులను నరికి వేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్న తీరును ఖండించారు. నల్లమల్ల అడవులు, విశాఖ పట్నంలో జిందాల్ కంపెనీల అక్రమ మైనింగ్ చేసుకునేం దుకు కార్పొరేటర్లకు కట్టబెట్టిందని గుర్తుచేశారు. అనంతరం మాజీ ఎంపీ మీడియం బాబురావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్ మాట్లాడారు. బీందాకరత్ హిందీ ప్రసంగాన్ని ఐలూ రాష్ట్ర నాయకులు రమేష్కుమార్ తెలుగులో అనువదించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుగులోత్ ధర్మ, అన్నవరపు సత్యనారాయణ, కొక్కెరపాటి పుల్లయ్య, యలమంచి రవికుమార్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.