Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు బోర్డుల అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోర్టు ఆదేశిస్తేగానీ చర్యలు తీసుకోరా?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏపీ పునర్ విభజన చట్టం 2014లో 9, 10 షెడ్యూల్స్లో ఉద్యోగుల విభజన చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ షెడ్యూల్స్లో వంద సంస్థలు ఉంటే వాటన్నింటికీ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాతే అధికారుల్లో కదలికి వస్తుందా? మీరు జీతభత్యాలు తీసుకోవడమే కాదు విభజన జరగక ఉద్యోగులు పడే కష్టాలను చూడాలి కదా? వాళ్ల బాధలు మీకు పట్టవా?.. అని రెండు రాష్ట్రాల ఇంటర్ బోర్డులను ప్రశ్నించింది అధికారుల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేదని, మీ వైఖరి ఇలాగే ఉంటే జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఏపీ డైయిరీ ఆస్తుల కేసులోనో మరో కేసులోనో మూడు నెలలు కేసును వాయిదా వేస్తే ఈ కేసులోనూ అదే తీరుగా వాయిదా కావాలని కోరితే ఎలాగనీ, అంటే ఆ కేసులో మాదిరిగానే ఈ కేసులోనూ హైకోర్టు ఆర్డర్ ఇస్తేనే ఇంటర్ బోర్డు ఉద్యోగుల విభజన చేస్తారా.. అని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ, ఏపీల ఇంటర్మీడియట్ బోర్డుల ఉద్యోగుల విభజనకు ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డులో సూపరింటెండెంట్లు ఎస్. సావిత్రి, కె.వెంకటేశ్వరరావు, జి.వెంకటరావు సంయుక్తంగా దాఖలు చేసిన కేసులను సోమవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం ఉద్యోగుల విభజన చేయకపోవడాన్ని తప్పుపడుతూ దాఖలైన రిట్ పిటిషన్లో తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్కుమార్లతో కూడిన డివజిన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎన్నాళ్లు వాయిదా కోరతారు. బోర్డు అధికారులు ఏం చేస్తున్నారు. జీతాలు తీసుకుంటే సరిపోదు. ఉద్యోగుల కష్టాలను కూడా చూడాలి. భావోద్వేగాలు లేకుండా గ్రహాంతరవాసుల మాదిరిగా ఉంటే ఎలా? సమస్యను సామరస్యంగా పరిష్కారానికి ఎందుకు శ్రద్ధ చూపడం లేదు... అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.