Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మోడీ సర్కారు ఊడిగం
- స్టాక్ ఎక్ఛేంజ్లో పెట్టడంపై ప్రజల్లో ఆందోళన
- ఇక పాలసీల భద్రత నీటిమీది రాతే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్ఐసీ! ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న సంస్థ. ప్రయివేటు బీమా సంస్థలు మోసాలను అరికట్టడంలో భాగంగానే పురుడుపోసుకున్నది. ప్రతి ఊరునీ...ప్రతి గడపకూ చేరి 40 కోట్ల పాలసీదారులను అక్కున చేర్చుకున్నది. కేంద్ర ప్రభుత్వానికీ బంగారు బాతులా యేటా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నది. ఏ సంస్థలకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందో ఆ కార్పొరేట్ సంస్థలకే మేలు చేసేందుకు మోడీ సర్కారు పూనుకున్నది. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల వాటాను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచింది. అదే సమయంలో ఎల్ఐసీ ఆస్తులను ముక్కలుగా విభజించి స్టాక్ ఎక్చేంజిలో పెట్టి ప్రజల సొమ్ముకు భద్రత లేకుండా చేయాలని చూస్తున్నది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మోడీ సర్కారు నిర్ణయాన్ని తప్పుబడుతూ ఎల్ఐసీ ఉద్యోగులు ఐక్య పోరు సాగించడానికి కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్నారు.
ప్రయివేటురంగంలో ఇన్సూరెన్స్ కంపెనీల్లో ప్రజల పొదుపునకు భద్రత లేకపోవడంతో 245 బీమా, ప్రావిడెండ్, తదితర సంస్థలను విలీనం చేస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)ను 1956లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు కేంద్రం పెట్టిన పెట్టుబడి కేవలం రూ.5 కోట్లే. 2010లో దాన్ని వంద కోట్లకు పెంచింది. ఎల్ఐసీ క్రమంగా ప్రజల మన్ననలను చూరగొంటూ దేశంలోని ప్రతి గడపకూ చేరింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆ సంస్థ తమ వద్ద పొదుపు చేసుకుంటే డబ్బులు కచ్చితంగా వస్తాయన్న నమ్మకాన్ని పాలసీదారుల్లో పాదుగొల్పింది. రూ.184 కోట్లతో ప్రారంభమై ఆరు దశాబ్ధాల కాలంలో రూ.32 లక్షల కోట్ల ఆస్తులు గల సంస్థగా ఎదిగింది. దేశవ్యాప్తంగా 40 కోట్లకు పైగా పాలసీదారులను సంపాదించుకున్నది. ఆ సంస్థ అభివృద్ధిలో 1,16,000 మంది సిబ్బందితో పాటు 11 లక్షలా 79 వేల మంది ఏజెంట్ల పాత్ర కూడా కీలకమైనది. అందులోని ప్రతిపైసా ,పజలదే. అయినప్పటికీ..2020 సంవత్సరం లోనే డివిడెండ్ల రూపంలో రూ.2,700 కోట్లకుపైగా కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసీ చెల్లించింది. ఇదికాక జీఎస్టీ, ఇతర రూపాల్లో మరో మరో 17వేల కోట్ల రూపాయలను ఇచ్చింది. అదే సమయంలో కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో ఇంకో పదివేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చిపెట్టింది. గోరంత పెట్టుబడి పెట్టిన కేంద్రం ఎల్ఐసీ నుంచి కొండంత ఆదాయాన్ని పొందుతున్నది. ఎల్ఐసీ తన పెట్టుబడుల్లోని 82 శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సెక్యూరిటీ బాండ్ల రూపంలో పెట్టింది. డెత్ క్లయిమ్లను చెల్లించడంలో 98.27 శాతంతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. లాభాల్లో 95 శాతం వాటాను పాలసీదారులకే ఇస్తున్నది. ఇప్పటికిప్పుడు పాలసీదారులకు సొమ్మంత చెల్లించినా ఇంకా రూ. మూడు లక్షల కోట్లకుపైనే మిగులును కలిగి ఉన్నది.
కార్పొరేట్ల కోసం ఎల్ఐసీను టార్గెట్ చేసిన బీజేపీ ప్రభుత్వాలు
బీమా రంగంలోకి 26శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 1999లో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ఆహ్వానించింది. తదనుగుణంగా 23 ప్రయివేటు కంపెనీలు పుట్టుకొచ్చాయి. 2014లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచింది. అయినా, దేశ వ్యాప్తంగా 23 కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీల పోటీని తట్టుకుని ఎల్ఐసీ బీమా రంగంలో 73 శాతం మార్కెట్ను కలిగి ఉన్నది. ఇదే ఆ కంపెనీలకు కంటగింపుగా మారింది. ఎన్ని నక్కజిత్తులు ప్రదర్శించినా ప్రజలు ఎల్ఐసీని తప్ప వాటిని నమ్మటం లేదు. ఈ నేపథ్యంలోనే ఇన్సూరెన్స్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 నుంచి 74 శాతానికి పెంచింది. కేంద్రం చేసిన ఈ నిర్ణయం అర్ధరహితం. ఇప్పటిదాకా ఇరవై మూడు కంపెనీల ద్వారా ఇప్పటి వరకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 35.5 శాతం మాత్రమే. అయితే, ప్రభుత్వ ఆధీనంలో సంస్థ దగ్గర పొదుపు డబ్బులకు ఉన్నంత భరోసా కార్పొరేట్ కంపెనీల వద్ద లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ ఇన్సూరెన్స్ సంస్థలు మోడీ సర్కారుపై ఎల్ఐసీ నిర్వీర్యానికి తీవ్ర ఒత్తిడి మొదలైంది. అందులో భాగంగానే ఎల్ఐసీలో ఐపీఓ ప్రకటించారు. స్టాక్ ఎక్చేంజ్లో ఎల్ఐసీని చేర్చడమంటే ప్రజల ఆస్తులను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో అప్పనంగా పెట్టడమే. ఎందుకంటే ఎల్ఐసీలోని ఆస్తులన్నీ పాలసీదారులవే. ప్రజల పొదుపునకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టి ఎల్ఐసీని ప్రయివేటీకరణవైపు తీసుకెళ్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ప్రజల సొమ్ముకు భద్రత ఉండదనే కారణంతో ఎల్ఐసీ స్థాపించారో దాని మూలసూత్రానికే తూట్లు పొడిచేలా కేంద్రం చర్యలు కనిపిస్తున్నాయి. 95 శాతం పాలసీదారులకు నిక్కచ్చిగా బీమా డబ్బులను అందజేస్తున్న ఎల్ఐసీ విషయంలో కేంద్రం చర్యలతో పొదుపు భద్రత హామీ నీటి మీది రాతలా మారనున్నది. ఎల్ఐసీలో ప్రయివేటు పెట్టుబడి జొరబడితే చట్టపరంగా ఎల్ఐసీ నిధులను వాడాలనే నిబంధనకు తూట్లుపడుతాయి. లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న ఎల్ఐసీ మౌలిక సూత్రానికి తిలోదకాలు ఇవ్వడమే.