Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటు : పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్
నవతెలంగాణ-తాండూరు
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని మినీ భూకైలాస్ ఫంక్షన్ హాల్లో పట్టభద్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ పాలన సాగించడం దారుణమన్నారు. రాష్ట్రంలో లక్షా 91 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, హామీ ఇచ్చినా ఏవీ భర్తీ చేయకపోవడంతో టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. కరోనా కారణంగా ప్రయివేటు ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిరుద్యోగులు, కార్మికులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే వారికి అసలు ప్రజా సమస్యలపై అవగాహన లేదన్నారు. తాండూరులో తన సమావేశాన్ని అడ్డుకోవాలని చూడటం మూర్ఖత్వం అన్నారు. ప్రజాస్వామ్యంలో సమావేశాలు నిర్వహిం చుకునే హక్కు అందరికి ఉంటుందన్నారు. గతంలో తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే తాండూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయించినట్టు గుర్తుచేశారు. ప్రజా సమస్యలు పట్టని బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సదానందగౌడ్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రత్నం, నాయకులు షఫీ, ప్రజాసంఘాల నాయకులు శ్రీనివాస్, బుగ్గప్ప, మల్కయ్య, పి. శ్రీనివాస్, వెంకటేష్, నారాయణగౌడ్, నర్సింలు, విటల్, ప్రయివేటు ఉపాధ్యాయులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.