Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకు ఎదుట ఆందోళనలకు దిగిన కుటుంబీకులు
- మద్దతు తెలిపిన గ్రామస్తులు, రైతులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పీఏసీఎస్ చైర్మెన్ వేధింపులు తట్టుకోలేక సహకార సంఘం సీఈఓ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లాలో కలకలం రేగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మంగళవారం జరిగింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దండుమైలారానికి చెందిన రాచకొండ మైలారం సహకార సంఘం సీఈఓగా పని చేస్తున్న మగ్బుల్ (ఫరీద్)ను ఆ సంఘం చైర్మెన్ బిట్ల వెంకట్ రెడ్డి.. బ్యాంకు నుంచి దీర్ఘ, స్వల్పకాలిక రుణాలు తీసుకున్న రైతుల నుంచి డబ్బులు వసూళ్లు చేయాలని నిత్యం ఉన్నతాధికారులతో పాటు ఒత్తిడి చేయడమే కాకుండా, విధుల నుంచి తొలగిస్తానని బెదిరిస్తూ నిత్యం వేధింపులకు గురి చేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం బ్యాంకు అధికారులు పలు రికార్డులను కూడా తనిఖీ చేశారు. ఎలాంటి తప్పు జరగలేదని తేల్చినట్టు బ్యాంకు సిబ్బంది తెలిపారు. బ్యాంకు అధికారుల విచారణ అనంతరం చైర్మెన్ వెంకట్రెడ్డి దుర్భాషలాడుతూ వేధించాడనీ, రాత్రి కూడా తీవ్ర మనోవేదనతోనే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, మంగళవారం సీఈఓ మగ్బుల్ తన ఇంటి నుంచి నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి వెళ్లాడు. అప్పటినుంచి అతను ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా, అప్పటికే ఉరేసుకుని కనిపించాడు. కంగారుపడిన కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి ఆయన్ను కిందకు దించగా.. అప్పటికే మృతిచెందాడు. చైర్మెన్ వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైట్ నోట్ లభ్యమయినట్టు కుటుంబసభ్యులు తెలిపరు. మగ్బుల్ ఆత్మహత్యతో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆయన మృతదేహన్ని సహకార సంఘం బ్యాంకు దగ్గరకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి చెందిన చైర్మెన్ బిట్ల వెంకట్ రెడ్డి వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ, అతడిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బ్యాంకు సిబ్బంది, పలు పార్టీల నాయకులు, గ్రామ సర్పంచ్ కుటుంబానికి మద్దతుగా ఆందోళనకు దిగారు. దాంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఆందోళనకారులతో ఏసీపీ చర్చలు జరిపారు. కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సైదులు తెలిపారు.