Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2.70లక్షలు లంచం తీసుకుంటూ..
- పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త ప్రమేయం
నవతెలంగాణ - నిర్మల్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతపేట్ గ్రామ శివారులో లేఅవుట్ అనుమతికి లంచం తీసుకుంటుండగా, ఎంపీఈఓ శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, సర్పంచ్ భర్త నేరెళ్ల అశోక్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2.70లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపాయి. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో అనంతపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని మహాలక్ష్మీ ఆలయ సమీపంలో వరంగల్కు చెందిన శ్రీనివాస్రావు, నరేశ్రెడ్డికి సంబంధించిన భూములున్నాయి. సర్వే నెంబర్ 17ఏ,బీ,సీ,డీలలో 13.11 ఎకరాల భూమిని లేఅవుట్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. లేఅవుట్ చేయడానికి గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ భూమి విలువకు 15శాతంతో చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ భర్త నేరెళ్ల అశోక్ రూ.3లక్షలు, ఎంపీఈఓ శ్రీనివాస్రెడ్డి రూ.2లక్షలు, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ లక్షన్నర మొత్తం రూ.6.50లక్షల లంచం డిమాండ్ చేశారు. గత్యంతరం లేక భూయజమానులు లంచం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. తరచూ లంచం డబ్బుల కోసం వేధించడంతో విసిగిపోయిన వారు ఏసీబీని ఆశ్రయించారు. మొదటి విడతగా సర్పంచ్ భర్త నేరెళ్ల అశోక్కు రూ.లక్ష, ఎంపీఈఓ శ్రీనివాస్రెడ్డికి రూ.లక్ష, పంచాయతీ కార్యదర్శికి రూ.70వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం వారికి డబ్బులు ముట్టజెప్పారు. ఇదే సమయంలో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తన బృం దంతో దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2.70లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి లంచం తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని కరీంనగర్ కోర్టులో హాజరుపర్చనున్నట్టు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య విలేకరులకు తెలిపారు.