Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2016-17 తరువాత గరిష్ట ధర
- పంట దిగుబడి తగ్గడంతో పెరిగిన ధర
- 40 వేల క్వింటాళ్లు తక్కువగా మార్కెట్కు పంట
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పండించిన పంటకు ఆశించిన ధర రావాలని గత కొన్నేండ్లుగా పోరాటాలు చేస్తున్న పసుపు రైతులకు రేటు విషయంలో ఈ సీజన్లో కొంత ఊరట కలుగుతోంది. గత కొన్ని రోజులుగా రూ.9 వేలకు పైగా పలికిన పంట ధర.. మంగళవారం ఏకంగా రూ.10 వేలు దాటింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో గరిష్టంగా క్వింటాల్ పసుపు రూ.10,188 ధర పలకడం.. 2016-17 తర్వాత ఇదే రికార్డు. అయితే ఈ సీజన్లో అధిక వర్షాలు, తెగుళ్లతో దిగుబడి బాగా తగ్గింది. గతేడాది ఇదే సమయానికి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు 2.75లక్షల క్వింటాళ్ల పంట రాగా.. ఈసారి 2.30 లక్షల క్వింటాళ్ల పంట వచ్చింది. పంట ఉత్పత్తి తగ్గడంతో ధరలో పెరుగుదల కనిపిస్తోంది. అలాగే మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లోనూ ధర పెరగడంతో నిజామాబాద్లోనూ పంటకు ధర పెరిగింది.నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో 34 వేల ఎకరాల్లో పసుపు పంట సాగు చేశారు. కానీ అధిక వర్షాలు, వాతావరణంలో విపరీతమైన మార్పులతో పంటకు తెగుళ్ల బాధ తప్పలేదు. ఎకరాకు 20 నుంచి 22 క్వింటాళ్ల పంట దిగుబడి రావాల్సి ఉండగా.. దుంప తెగుళ్లు సోకడంతో కేవలం 15 నుంచి 17 క్వింటాళ్ల మధ్య పంట చేతికొచ్చింది. పంట ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పెరిగింది. గత మూడేండ్లుగా పంట ధరలో పెరుగుదల లేకపోవడంతో ఈ యేడాది ధర పెరిగే అవకాశముందని అధికారులు ఊహించారు. అనుకున్నట్టుగానే 2016-17తో పొల్చితే ధర భారీగా పెరిగింది. 2016-17లోనూ క్వింటా పసుపునకు రూ.9 వేల వరకు ధర పలికింది. అయితే పంట ధర విషయంలో ఫిబ్రవరి వరకూ రైతుల్లో ఆందోళన నెలకొంది. ఫిబ్రవరి మధ్య వరకు క్వింటా పసుపు ధర రూ.6700 మాత్రమే పలికింది. కానీ మార్చి మొదటి వారానికి ఏకంగా ధర రూ.10 వేలు దాటింది. మంగళవారం గరిష్టంగా క్వింటాకు రూ.10,188 ధర పలకగా.. ఆ తరువాత క్వింటాకు రూ.10,100తో రైతులు పంటలు అమ్ముకున్నారు. అయితే మొత్తంగా వ్యవసాయ అధికారుల గణాంకాల ప్రకారం సగటున క్వింటాకు రూ.7000 ధర వస్తోంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నుంచి పంటలను యూకే, యూరప్, పిలిపైన్స్ తదితర విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అంతర్జాతీయంగా పసుపు నిల్వలు తగ్గిపోవడంతోనూ డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ ఇలానే కొనసాగితే క్వింటాకు రూ.12 వేల ధర కూడా పలికే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
రైతులు తడి పంటను తేవొద్దు : అపర్ణ, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి
ఈ సీజన్లో పసుపు పంటకు మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. మొదటిసారి రూ.10 వేల మార్క్ దాటింది. ధర ఇలాగే కొనసాగితే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే రైతులు తడి పంటను మార్కెట్కు తేవొద్దు. మంచిగా ఆరబెట్టి నిర్దేశించిన తేమ శాతం ప్రకారం పంటను మార్కెట్కు తీసుకొస్తే ఎక్కువ ధర వచ్చే అవకాశముంది. తేమ శాతం, పంట ఆరబోత, ఏ సమయంలో పంటను మార్కెట్కు తీసుకురావాలో ఇప్పటికే గ్రామాల్లో మార్కెట్ శాఖ తరపున అవగాహన కల్పించాం. రైతులు తప్పనిసరిగా అవన్నీ పాటించాలి.