Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ, ఎన్ఎహెచ్ఏఐ అధికారుల సమీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఆయా దశల్లో ఉన్న 29 రోడ్ల అనుమతులు, పురోగతిపై అటవీ శాఖ అధికారులతో జాతీయ రహదారుల సంస్థ సలహాదారు ఏ.కె.జైన్ సమీక్షించారు. బుధవారం హైదరాబాద్లో అరణ్యభవన్లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభతో కలిసి రాష్ట్రంలో ఆయా ప్రాంతాల గుండా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, త్వరితగతిన పనులు, వేగంగా అటవీ అనుమతుల తాజా స్థితిపై చర్చించారు. మొదటి దశ, రెండో దశ అనుమతులకు కావాల్సిన పనులను వేగంగా ఇచ్చేందుకు అవసరమైన సమన్వయంపై ఇరువురు అధికారులు ముచ్చటించారు. సంగారెడ్డి-నాంధేడ్-అకోలా,హైదరాబాద్-మన్నెగూడ, నిజామాబాద్-జగదల్పూర్, మంచిర్యాల-చెన్నూరు, హైదారాబాద్-భూపాలపల్లి జాతీయ రహదారుల విస్తరణతో పాటు, ఇతర రోడ్ల అనుమతులపై వివరంగా చర్చించారు.
అలాగే అన్ని జాతీయ రహదారుల వెంట పచ్చదనం పెంపు, మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ అభివృద్ది మోడళ్లుపెంచాలని నిర్ణయించారు. కొన్ని రహదారుల వెంట కిలో మీటర్ల మేర ప్రాంతాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టులో భాగంగా మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలనీ, వాటి ఫలితాల ఆధారంగా విస్తరించాలని అవగాహనకు వచ్చారు. సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.దోబ్రియాల్, జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ అధికారి ఏ.కృష్ణ ప్రసాద్, సంయుక్త సలహాదారు కె.ఎస్.రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు ఎం. రవీందర్ రావు, పి. సాగేశ్వర రావు, పి. ధర్మారెడ్డి పాల్గొన్నారు.