Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2014 నుంచి 2017 వరకు 27,346కోట్ల వ్యయం
- 33 పద్దుల్లో కేటాయింపులెక్కువ.. ఖర్చు తక్కువ
- ఆరేండ్లుగా ఇదే సీను.. కాగ్ లెక్కల్లో వెల్లడైన వాస్తవాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 204 (3) ప్రకారం... అసెంబ్లీ ఆమోదం లేకుండా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయటానికి వీల్లేదు. ఒకవేళ శాసనసభ ఆమోదం పొందిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తే... మళ్లీ చట్ట సభను సమావేశపరచాలి. దాని ఆమోదం పొందిన తర్వాతే తిరిగి ఖర్చు చేయాలి. కానీ ఇందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో శాసనసభ ఆమోదం లేకుండానే ఏకంగా రూ.2,218 కోట్లను సర్కారు ఖర్చు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 205 ప్రకారం అదనపు వ్యయాన్ని ప్రజా పద్దుల సంఘం (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ)లో చర్చించి, ఆ తర్వాత సభలో ప్రవేశపెట్టాలి. అసెంబ్లీ ఆమోదించిన తర్వాతే సంబంధిత నిధులను ఖర్చు చేయాలి. రాజ్యాంగ పరమైన ఇలాంటి ప్రక్రియలను పాటించకుండానే 2014-15 నుంచి 2016-17 వరకూ సర్కారు రూ.27,346 కోట్లను వ్యయం చేసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలు ఇవే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. వీటిని కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే అనేక విషయాలు వెల్లడవుతున్నాయి. అనేక కీలక, ముఖ్యమైన శాఖలు, రంగాలకు కేటాయింపులు ఎక్కువ చేసి చూపారు. అదే సమయంలో ఖర్చు మాత్రం ఆ స్థాయిలో లేదని స్పష్టమవుతున్నది. ఉదాహరణకు సామాజిక సంక్షేమ శాఖకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.12,152 కోట్లను కేటాయిస్తే, అందులో కేవలం రూ.7,624 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. ఇదే రకంగా 2017-18లో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల్లో 53 శాతాన్నే వాడారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న వాటిలో కూడా కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలకే లక్ష్యాలకు అనుగుణంగా నిధులను కేటాయించి, వినియోగించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, వెనుకబడిన తరగతులకు చెందిన కార్పొరేషన్లు తదితరాలకు నిధుల్లేకపోవటంతో పనుల్లో పురోగతి కనిపించలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరుస్తున్న మొత్తం 40 పద్దుల్లో.. 33 పద్దులకు సంబంధించిన కేటాయింపులను పరిశీలిస్తే వాటి కంటే వాస్తవ ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయని తేలింది. అంటే ఈ పద్దులకు సంబంధించి అసెంబ్లీలో చేసిన కేటాయింపులు పూర్తిగా ఖర్చు కాలేదన్నమాట. మొత్తంగా గత ఆరేండ్ల కాలంలో కేటాయింపులనేవి 22 శాతం మేర వ్యయం చేయలేదని తేలింది. ఇదే సమయంలో మిగతా ఏడు పద్దుల్లో మాత్రం కేటాయింపుల కంటే ఖర్చే అధికంగా ఉండటం గమనార్హం. పోలీస్ శాఖ ఒక్కదానికే ప్రతీయేటా అదనపు కేటాయింపులు ఉంటున్నాయి. శాసనసభ ఆమోదం లేకపోయినప్పటికీ ఆ శాఖకు 2015 నుంచి 2018 వరకు అదనంగా రూ.2,327 కోట్లను ఖర్చు చేయటాన్నిబట్టి ప్రభుత్వ ప్రాధాన్యతలేంటో అర్థమవుతున్నది. ఈ పరిస్థితి మారాలనీ, సామాజిక సంక్షేమానికి, విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి కల్పనా రంగాలకు అధిక నిధులు కేటాయించి, వినియోగించాలంటూ ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.