Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ విద్యార్థుల వార్షిక పరీక్షలను బడుల్లోనూ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కాలేజీలతోపాటు గురుకుల విద్యాలయాల్లో ఇప్పటి వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. విద్యార్థికి విద్యార్థికి మధ్య ఆరు ఫీట్ల భౌతిక దూరం, మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగించడం తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అందుకే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎక్కువ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూనియర్ కాలేజీలు, గురుకులాలతోపాటు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లోనూ ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన వసతులు సక్రమంగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగమయ్యారు. బెంచీకి ఒక విద్యార్థి పరీక్ష రాసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మే ఒకటి నుంచి ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న విషయం విదితమే. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో 4.60 లక్షల మంది, ద్వితీయ సంవత్సరంలో 4.40 లక్షల మంది, ప్రయివేటు విద్యార్థులు 30 వేలు కలిపి మొత్తం 9.30 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. గతంలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు మరో 1.92 లక్షల మంది ఉన్నట్టు తెలిసింది. అందులో చాలా మంది ఒకటి లేదా రెండు, మూడు సబ్జెక్టులు ఫెయిలైన వారుంటారు. ఫెయిలైన సబ్జెక్టుల ఆధారంగా ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు ప్రథమ సంవత్సరం నుంచి 4,80,516 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 4,85,323 మంది కలిపి 9,65,839 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారి కోసం 1,339 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 1,339 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,339 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 26,964 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అలాగే ఈ ఏడాది పరీక్షా కేంద్రాలతోపాటు ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సంఖ్యా పెరగనుంది. ఈ ఏడాది 2 వేల వరకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో 2 వేల మంది వరకు చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 2 వేల మంది వరకు డిపార్ట్మెంటల్ అధికారులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 35 వేల నుంచి 40 వేల మంది వరకు ఇన్విజిలేటర్లు అవసరమయ్యే అవకాశమున్నది. ఇందు కోసం పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు ఆలోచన చేస్తున్నారు.
విద్యార్థుల సౌకర్యం కోసమే : ఖాలిక్, సీవోఈ
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి (సీవోఈ) ఎండీ అబ్దుల్ ఖాలిక్ 'నవతెలంగాణ'తో చెప్పారు.
విద్యార్థులకు మరింత సౌకర్యం కల్పించడం కోసమే పాఠశాలల్లోనూ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరముందని అన్నారు. అందుకే ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచుతామన్నారు. మెరుగైన వసతులున్న పాఠశాలలనే పరీక్షా కేంద్రాలకు ఎంపిక చేస్తామని చెప్పారు.