Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పలు కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పీపీ) లేకపోవడంతో క్రిమినల్ కేసుల విచారణ జాప్యమవుతున్నదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అయిదు వందలకుపైగా కోర్టులకుగానూ 414 పోస్టులు ఉంటే 212 పోస్టులను మాత్రమే భర్తీ చేయడాన్ని తప్పుపట్టింది. రెండు వందల పోస్టులే ఖాళీగా ఉన్నాయనీ, వీటి విషయంలో చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంపై మండిపడింది. ప్రాసిక్యూషన్ డైరెక్టర్ పోస్టును పూర్తి స్థాయిలో భర్తీకి చర్యలు తీసుకోవాలనీ, పీపీ పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. పీపీ పోస్టుల ఖాళీలపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్గా పరిగణించి విచారణ చేపట్టింది. పోస్టుల భర్తీ చేయకపోవడం కోర్టుల్లో కేసులు వాయిదా పడతున్నాయనీ, ఇది కోర్టు ప్రక్రియకు అంతరాయం కలిగించడమే అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.