Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
- స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటు
- విద్యార్థులకు దుస్తులు, పలకలు పంపిణీ
నవతెలంగాణ-గోవిందరావుపేట
మారుమూల అటవీ ప్రాంతాల్లో నివాసముంటున్న గొత్తికోయ పేదలను స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆకాంక్షించారు. ములుగు జిల్లా కేంద్రం గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ గ్రామ సమీపంలోని గొత్తికోయగూడెంలో పీహెచ్సీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాఠశాలను సీతక్క గురువారం ప్రారంభించారు. అనంతరం సంస్థ తరపున బాలలకు దుస్తులు, పలకలు, ఇతర సామాగ్రి అందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాల నుంచి వచ్చి అటవీ ప్రాంతాల్లో అనేక ఏండ్లుగా నివాసం ఉంటున్న గొత్తికోయ కుటుంబాలు తీవ్ర వెనుకబాటుతనానికి గురౌతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు గొత్తికోయ పేదలకు ఆపన్నహస్తం అందించాలని సూచించారు. పీహెచ్సీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటు చేసి బాలలకు దుస్తులు, పలకలు అందించడం అభినందనీయమన్నారు. గొత్తికోయగూడెంకు వెళ్లే దారి సరిగా లేకపోవడంతో స్థానికులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సీతక పలుగు, పార పట్టి రహదారి పనులు చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, రోనీ పాస్టర్, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి సంతోష్, మాజీ మండల అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, పాలడుగు వెంకటకృష్ణ, జంపాల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.