Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య అనుచరుడు ఇల్లందు మండలం ఇందిరానగర్ టీఆర్ఎస్ ఎంపీటీసీ మండల రాముపై బుధవారం అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. బాధితుడు రాము తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది కార్యకర్తలతో కలిసి రాము బుధవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం రాత్రి 12 గంటల సమయంలో తన బైక్పై పట్టణం వైపు వెళ్తుండగా ఇల్లందు ప్రధాన రహదారిలో సమ్మక్క ఆర్చి సమీపంలో ఆయుధాలతో ఒక వ్యక్తి ఉండగా.. మరి కొంతమంది కారులో రోడ్డుకు ఇరువైపులా మాటు వేసుకొని ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి రాముపై ఆయుధంతో దాడి చేయడానికి ప్రయత్నించడంతో తప్పించుకొని బైక్పై వెళ్తుండగా కారులో వెం బడించారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం ఇచ్చి తప్పిం చుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు కారులో పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అతనిచ్చిన సమాచారం మేరకు భారీ ఎత్తున మారణ ఆయుధాలు స్వాధీనపరుచుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతేడాది కూడా ఇదే నెలలో మండల రాముపై హత్యాప్రయత్నం చేశారు. అప్పుడు కూడా ఇదే తరహాలో బైకుపై వెళ్తున్న రాముపై కత్తులతో ఎటాక్ చేయడంతో అతను అప్రమత్తతతో తప్పించుకొని పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు. మరోసారి కూడా హత్యాయత్నం జరిగినట్టు తెలిసింది. ఇలా ఒకే వ్యక్తిపై మూడు సార్లు హత్యాయత్నం జరగడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.