Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంట చేస్తుండగా ప్రమాదం
నవతెలంగాణ:మెదక్
వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకొని తల్లీకూతురు మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని అజంపురా వీధిలో గురువారం జరిగింది. మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం తిమ్మనగర్ గ్రామానికి చెందిన గట్టయ్య మక్త భూపతిపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఆర్పీగా ఉద్యోగం చేస్తున్నాడు. దాంతో భార్య రేవతి (28), కూతురు అధ్యశ్రీ(2)తో కలిసి మెదక్ పట్టణంలోని అజంపురాలో నివాసం ఉంటున్నారు. కాగా, రోజు మాదిరిగానే గట్టయ్య డ్యూటీకి వెళ్లిన అనంతరం రేవతి(28) ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీర కొంగుకు నిప్పంటుకుంది. దాంతో ఆమెతో పాటు కూతురు అధ్యశ్రీ(2) అగ్గికి ఆహుతయ్యారు. ఇంట్లో నుంచి అరుపులు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చేసరికి ఇద్దరూ పూర్తిగా కాలిపోయి పడి ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రేవతి తండ్రి కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.