Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుషుల్లో 53 శాతం.. మహిళల్లో 56 శాతం
- 75 శాతం మందికి కరోనా వచ్చిన విషయమే తెలియదు : సీసీఎంబీ సీరో సర్వైలెన్స్ సర్వేలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా మహమ్మారి ఎక్కువగా ప్రభావం చూపించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అదే స్థాయిలో కోవిడ్-19 యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు తాజా సర్వేలో వెల్లడైంది. సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలి క్యులర్ బయాలజీ (సీసీఎంబీ), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), భారత్ బయోటెక్ సంయుక్తంగా 9000 మంది నమూనాలను పరీక్షించగా 54 శాతం మందిలో ప్రతిరక్షకాలు ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో సర్వే ఫలితాలు వివరాలను సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా, ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మయ్య, సీసీఎంబీ సీఏఓ డాక్టర్ మధుసూదన్ రావు, భారత్ బయోటెక్ ప్రతినిధి డాక్టర్ కృష్ణమోహన్ వెల్లడించారు. పురుషుల్లో 53 శాతం మందిలో ఉండగా, మహిళల్లో 56 శాతం మందిలో యాంటీబాడీలున్నాయి. కాగా వయస్సుల వారీగా చూస్తే 70 ఏండ్లు పైబడిన వారిలో ఇవి తక్కువగా 49 శాతమే ఉన్నాయి. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీరి సంఖ్య తక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరోనా సోకిన వారి కుటుంబాల్లో 78 శాతం మంది, లేని కుటుంబాల్లో ఇది 68 శాతంగా ఉన్నది. వారిలో 75 శాతం మందికి తమకు కరోనా వచ్చిన విషయమే తెలియకపోవడం గమనార్హం. జీహెచ్ఎంసీ పరిధిలో 100 డివిజన్లు ఉండగా అందులో ర్యాండమ్ గా 30 డివిజన్లను ఎంపిక చేసి ఒక్కో డివిజన్ లో 300 మంది చొప్పున పరీక్షలు నిర్వహించారు. 9000 మందిలో 54 శాతం మంది మహిళల నమూనాలుండగా, 46 శాతం పురుషులవి ఉన్నాయి. జీహెచ్ఎంసీలోని అన్ని ప్రాంతాల్లో వీటి శాతం దాదాపు ఒకే రకంగా ఉండగా, కార్వాన్ లాంటి ఒకట్రెండు ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉన్నట్టు బయటపడింది. 10 సంవత్సరాల వయస్సు నుంచి 90 సంవత్సరాల లోపు వారు సర్వేలో పాల్గొన్నారు. రెండు దశల్లో జనవరి 4 నుంచి 12 వరకు 4500, జనవరి 14 నుంచి 25 వరకు నమూనాలను సేకరించి విశ్లేషించారు.
హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా నగరం ......డాక్టర్ రాకేశ్ మిశ్రా
హైదరాబాద్ నగరం హెర్డ్ ఇమ్యూనిటీ (సామూహికంగా ఎదుర్కోగలిగే శక్తి) దిశగా పయనిస్తున్నదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఈ దశలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మరో 25 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోగలిగితే హెర్డ్ ఇమ్యూ నిటీ సాధ్యమవుతుందన్నారు. కరోనా కొత్త వేరియ ంట్ల విషయంలో ఆందోళన చెందవద్దని కోరారు. మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, అవసరమైతే తప్ప బయటికి వెళ్లకపోవటం వంటి జాగ్రత్తలు కొనసాగించాలని సూచించారు. యూరప్ కన్నా ఆసి యా ప్రాంతంలోనే మరణాల సంఖ్య తక్కువగా ఉందనీ, అందుకు కారణాలను పరశోధించాల్సి ఉంద న్నారు. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో సర్వేలు కొనసా గుతాయని స్పష్టం చేశారు. ఇతర నగరాల్లోనూ ఇలాంటి సర్వేలు చేపట్టే అవకాశముందన్నారు.
వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే.....డాక్టర్ లక్ష్మయ్య
ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మయ్య తెలిపారు. యాంటీబాడీలు ఉన్నంత మాత్రానా పూర్తి సురక్షితంగా ఉన్నట్టు భావించరాదన్నారు. కరోనా సోకిన వారిలో ఉన్న యాంటీబాడీలు కనీసం 6 నెలల పాటు బలంగా ఉండి ఆ తర్వాత బలహీన పడుతుందని తెలిపారు. వ్యాక్సిన్ ఏడాది పాటు రక్షణ ఇస్తుందని చెప్పారు.