Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి నుంచే తెచ్చుకుంటున్న పిల్లలు
- బిల్లులు రావడం లేదని చేతులెత్తేసిన ఏజెన్సీలు
నవతెలంగాణ-వేంసూరు
మధ్యాహ్న భోజన పథకానికి ఆ పాఠశాల దూరమైంది. బిల్లులు రావడం లేదనీ, ఏజెన్సీలు నడుపలేమంటూ చేతులెత్తేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అడసర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 260 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మధ్యాహ్న భోజనం నడిపే ఏజెన్సీలకు కోడిగుడ్లు, భోజనానికి కలిపి లక్షల్లో బిల్లు రావాల్సి ఉన్నాయి. గ్రామాల్లో ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో భోజనం పెట్టలేమని ప్రధానోపాధ్యాయులకి గతంలోనే తెలియజేసి వారం రోజులు నిలిపివేశారు. ఈ విషయాన్ని మండల అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామస్తుల సహకారంతో కొన్ని రోజులు నడపగలిగారు. అయినప్పటికీ బిల్లులు రాకపోవడంతో మధ్యాహ్నం భోజనం నడిపే నిర్వాహకులు కొంతమంది కూలి పనులకు వెళ్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి కోడిగుడ్లు, భోజనం బిల్లులు రాలేదు. దాంతో భోజనం వండటం నిలిపివేయడంతో నాలుగు రోజులుగా విద్యార్థులు ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకొని తింటున్నారు. ఈ నెల4న ప్రధానోపాధ్యాయుడు కాంతారావు మధ్యాహ్న భోజనం సమస్యను ఎంఈఓ, ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లడంతో వారు పాఠశాలను సందర్శించారు. ఏజెన్సీ ప్రజా ప్రతినిధులతో చర్చించి ఏదో విధంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై నవతెలంగాణ ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎల్ కాంతారావుని వివరణ కోరగా.. మధ్యాహ్న భోజనం నడిపే ఏజెన్సీలకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో నడపటం భారంగా మారింది. ఇప్పటివరకు షాపుల్లో అప్పులు చేసి నడిపారు. ఆ అప్పులు పెరగడంతో కిరాణా షాపుల్లో సరుకులు ఇవ్వడం లేదు. దాంతో నాలుగు రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. ఈ విషయాన్ని ఎంఈఓ, ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లాము.