Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ నోటిఫికేషన్ ఈనెల 18న విడుదల కానుంది. శనివారం ఆన్లైన్లో ఎంసెట్ కమిటీ తొలి సమావేశం జరిగింది. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ఎ గోవర్ధన్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా మే 18 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థుల వివరాల్లో సవరణలకు మే 19 నుంచి 27 వరకు చేసుకోవచ్చని సూచించారు. ఆలస్య రుసుంతో జూన్ 28 వరకు దరఖాస్తు చేయొచ్చని వివరించారు. ఆలస్య రుసుం రూ.250తో మే 28 వరకు, రూ.500తో జూన్ 7 వరకు, రూ.2,500తో అదేనెల 17 వరకు, రూ.5 వేలతో అదేనెల 28 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశముందని తెలిపారు. జులై 5,6 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ విభాగానికి, 7,8,9 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి ఆన్లైన్లో రాతపరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒకవిడత, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు రెండోవిడత నిర్వహిస్తామని వివరించారు. రాష్ట్రంలో 18 జోన్లు, ఏపీలో ఐదు జోన్ల పరిధిలో పరీక్షా కేంద్రాలుంటాయని తెలిపారు. విద్యార్థుల సౌకర్యం కోసం ఈ ఏడాది కొత్తగా హైదరాబాద్ సౌత్ పేరుతో శంషాబాద్, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి జోన్లను కొత్తగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.400, ఇతరులు రూ.800, అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజీనిరింగ్ రెండు విభాగాలకు దరఖాస్తు చేసేందుకు ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.800, ఇతరులు రూ.1,600 చెల్లించాలని సూచించారు.
అన్ని ప్రశ్నలూ రాయాల్సిందే...
ఎంసెట్ ప్రశ్నాపత్రంలో ఇచ్చే అన్ని ప్రశ్నలూ రాయాల్సిందేనని కన్వీనర్ ఎ గోవర్ధన్ స్పష్టం చేశారు. మూడు గంటల్లో 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని సూచించారు. కరోనా నేపథ్యంలో జేఈఈ మెయిన్స్లో 90 ప్రశ్నలిచ్చి 75 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని విద్యార్థులకు చాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎంసెట్లోనూ ఇదే తరహా అవకాశం కల్పిస్తారని విద్యార్థులు ఆశించారు. కానీ ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వలేదు. ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి 100 శాతం, ద్వితీయ సంవత్సరం నుంచి 70 శాతం సిలబస్ను పరిగణనలోకి తీసుకుని ఎంసెట్ ప్రశ్నాపత్రం రూపొందిస్తామని వివరించారు. అందుకే ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 55 శాతం ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 45 శాతం ప్రశ్నలు వస్తాయని తెలిపారు. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉన్న విషయం విదితమే.
ఎంసెట్ షెడ్యూల్
నోటిఫికేషన్ విడుదల - మార్చి 18
దరఖాస్తుల స్వీకరణ షురూ - మార్చి 20 నుంచి
దరఖాస్తుల సమర్పణకు గడువు - మే 18 వరకు
అగ్రికల్చర్, ఫార్మసీ రాతపరీక్షలు - జులై 5,6 తేదీల్లో
ఇంజినీరింగ్ రాతపరీక్షలు - జులై 7,8,9 తేదీల్లో