Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా బ్యాలెట్ పత్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు తయారు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు రావడమే ఇందుకు కారణం. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి 93 మంది, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో బ్యాలెట్ పత్రం సైజూ భారీగానే ఉండనుంది. రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఈసారి ఎక్కువగా పోటీలో నిలిచారు. అందుకే బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరిగింది. 2015 ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి 33 మంది, నల్లగొండ నుంచి 27 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ రెండు స్థానాలకు ఈనెల 14న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈనెల 17న లెక్కింపు ఉంటుంది. హైదరాబాద్ స్థానంలో 5,31,268 మంది, నల్లగొండలో 5,05,565 మంది చొప్పున మొత్తం 10,36,833 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. హైదరాబాద్లో 799, నల్లగొండలో 731 చొప్పున మొత్తం 1,530 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శాసనమండలి ఎన్నికల్లో బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల పేర్లు, సీరియల్ నెంబర్లు, రాజకీయ పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థి అని మాత్రమే ముద్రించి ఉంటాయి. ఎన్నికల కమిషన్ వారికి ఎలాంటి గుర్తులు కేటాయించదు. ఓటర్లు దీన్ని గమనంలో ఉంచుకోవాలి. అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓటర్లు అంకెలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క అభ్యర్థికి లేదా పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ప్రాధాన్యతా అంకెలను కేటాయించాలి.