Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్/గూడూరు
పాలకుల వైఫల్యాలతో దశాబ్దాలుగా జీవనోపాధికి నోచుకోని గిరిజనం పోడు భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఆ భూములను పట్టాలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు గుప్పిస్తూనే హరితహారం ముసుగులో అటవీశాఖ అధికారులు పోడు భూములపై దౌర్జన్యానికి తెగబడుతున్నారు. రైతులకు హక్కులు కల్పించేలా 2005లో వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరు గారుస్తోంది. జిల్లాలో గిరిజన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా పోడు రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదు. దీనికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని లైన్తండాలో నెల రోజులుగా సాగుతున్న పోడుపోరే ఉదాహరణ. శనివారం పోడు సాగును అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు తండాకు వెళ్లడంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. అధికారుల తీరుకు నిరసనగా ఓ పోడు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన అధికారులు, తండావాసులు వీరన్నను హుటాహుటిన ఆ మండల కేంద్రంలోని పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైతు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
గూడూరు మండలం లైన్తండా సమీపంలోని సుమారు 300 ఎకరాల అటవీ భూమిలో సుమారు మూడు దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ అధికారులు నెల రోజులుగా సదరు భూముల్లో కందకాలు తీసేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో అటవీ అధికారులు, గిరిజన రైతులకు మధ్య జరిగిన ఘర్షణతో మనస్తాపం చెందిన మహిళా రైతు పురుగుల మందు తాగి బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కొన ఊపిరితో బయటపడింది. అప్పుడు తిరిగివెళ్లిన అధికారులు కొద్దిరోజుల అనంతరం మళ్లీ దాడి చేశారు. జెడ్పీటీసీ సుచిత్ర ఘటనాస్థలికి చేరుకుని.. స్వయంగా మంత్రి ఆదేశించినా మళ్లీ అటవీ అధికారుల దాడులేంటని ప్రశ్నించారు. సమస్యను గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు ఫోన్లో వివరించారు. మంత్రి డీఎఫ్ఓ రవికుమార్కు ఫోన్ చేసి పోడుభూముల్లో పనులు చేపట్టొద్దని ఆదేశించింది. ఆ భూములకు సీఎం కేసీఆర్ పట్టాలిచ్చేందుకు హామీ ఇచ్చారని తెలిపింది. ఈ క్రమంలోనే స్థానిక ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ సైతం అటవీ శాఖ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పోడు రైతుల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయినా డీఆర్వో నరేందర్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది భారీ బలగాలతో శనివారం లైన్ తండాకు చేరుకుని పోడుభూముల్లో కందకాలు తీసేందుకు యత్నించారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు, పోడు రైతుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సునీత ఫిర్యాదు మేరకు తండాకు చెందిన గిరిజన రైతులు తేజవత్ శ్రీను, తేజావత్ కొమ్మాలు, తేజావత్ నర్సింహ, బానోత్ భానోత్ ఈరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరుసగా ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా అటవీ అధికారులు అత్యుత్సాహం చూపడం వివాదాస్పదంగా మారింది.